సంక్షేమమే గెలిపిస్తుందనుకుంటే..

ABN , First Publish Date - 2021-03-08T10:22:40+05:30 IST

‘‘సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు... ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా, ఎన్నికల్లో

సంక్షేమమే గెలిపిస్తుందనుకుంటే..

బెదిరింపులు, ఏకగ్రీవాల కోసం తహతహలు ఎందుకు?: మధు


విశాఖపట్నం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘‘సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పుకుంటున్న వైసీపీ నాయకులు... ఇతర పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? ఏకగ్రీవాల కోసం ఎందుకు తహతహలాడుతున్నారు?’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రశ్నించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారంలో వున్న పార్టీ వారు పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ, దొంగ ఓట్లు వేసుకోవడం, పోలింగ్‌ సిబ్బందిని బెదిరించడం చూశామన్నారు. ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలవారు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఒకవేళ వేసినా... వాటిని ఉపసంహరించుకునేలా బెదిరించడం, ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరించడం వంటివి మొదటిసారి చూస్తున్నామని అన్నారు. తమ పార్టీవారికి కూడా బెదిరింపులు తప్పలేదన్నారు.


విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించాలంటూ తెచ్చిన చట్టంతో భవిష్యత్తులో ఆస్తిపన్ను కట్టాలంటే ఉన్న ఆస్తిని అమ్ముకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈ నెల తొమ్మిదిన జరగబోయే నీతీఆయోగ్‌ సమావేశంలో.. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ఆస్తులను విక్రయించాలని, సంస్థలను ప్రైవేటీకరించాలని, ఈ మేరకు జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్రాలను ఆదేశించబోతున్నదని మధు తెలిపారు. 

Updated Date - 2021-03-08T10:22:40+05:30 IST