లాక్‌డౌన్‌లోనూ ఆగని వేధింపులు

ABN , First Publish Date - 2020-04-09T09:25:33+05:30 IST

లాక్‌డౌన్‌లోనూ ఆగని వేధింపులు

లాక్‌డౌన్‌లోనూ ఆగని వేధింపులు

భయాందోళనకు గురిచేస్తున్న సీఆర్‌డీఏ అధికారులు  

రాజధాని ప్రాంత రైతుల ఆవేదన

113వ రోజుకొనసాగిన ఆందోళనలు


గుంటూరు, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): దేశమంతా లాక్‌డౌన్‌ సమయంలోనూ అధికారుల వేధింపులు ఆగటం లేదని రాజధాని ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నుంచే రాష్ట్ర పాలన కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు బుధవారానికి 113వ రోజుకు చేరాయి. అమరావతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమంటూ తుళ్లూరు, పెదపరిమి, నీరుకొండ దీక్షా శిబిరాల్లో రైతులు నినాదాలు చేశారు. తుళ్లూరు, అనంతవరం, మందడం, రాయపూడి, వెలగపూడి, కృష్ణాయపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు తదితర గ్రామాల్లో మహిళలు ఇళ్లల్లో కూర్చొనే నిరసనలు తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ సమయంలో మంగళవారం నీరుకొండ, ఐనవోలులో..., బుధవారం మందడంలో సీఆర్డీఏ అధికారులు పర్యటించడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్‌లోని ఆర్‌5 రెసిడెన్షియల్‌ జోన్‌పై ప్రజాభిప్రాయసేకరణకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని అధికారులు చెప్పడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇందుకు ఇదా సమయం అని నిలదీశారు. కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయాలను స్కైప్‌ ద్వారా తెలియజేయాలంటున్నారని.. వీటిని చూస్తుంటే  భయభ్రాంతులకు గురవుతున్నామని మహిళలు తెలిపారు.  రెండు గంటల పాటు వాగ్వివాదం జరిగిన తర్వాత అధికారులు వెనుతిరిగారు. ‘అమరావతి వెలు గు’ కార్యాక్రమాన్ని బుధవారం కూడా కొనసాగించారు. లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో సీఆర్‌డీఏ అధికారులు అభిప్రాయ సేకరణకు రావడం చట్టరీత్యా నేరమని రైతులు అంటున్నారు. సీఆర్‌డీఏ అధికారుల తీరును, వారి పేరు, ఐడీ తదితర వివరాలను వీడియో రికార్డు చేశారు. కేంద్ర హోం శాఖ సెక్రటరీకి వీడియోలను పంపాలని రైతులు, జేఏసీ నేతలు తీర్మానించారు. అలాగే సీఆర్‌డీఏ కమిషనర్‌కు పరిస్థితిపై సమాచారం అందించాలని నిర్ణయించారు. 


మహిళలను దూషిస్తే జైలుకే: సైబర్‌క్రైమ్‌ ఎస్పీ 

మహిళలను అసభ్యపదజాలంతో అవమానించిన వారు జైలుకు వెళ్లకతప్పదని సైబర్‌ క్రైమ్‌ ఎస్పీ రాధిక హెచ్చరించా రు. అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న  మహిళలపై ఫేస్‌బుక్‌ వేదికగా అసభ్యపదజాలంతో పోస్టులు సృష్టించి, ఆ మహిళలను తీవ్రంగా అవమానించిన ఘటనలో వర్రా రవీందర్‌ రెడ్డిపై కేసు నమోదు చేశామని బుధవారం ఆమె ఒక ప్రకటనలో  తెలిపారు. సోషల్‌ మీడియాలోగానీ, ప్రత్యక్షంగా గానీ మహిళల విషయంలో ఎవరైనా పరిధులు దా టి వ్యవహరిస్తే వారికి జైలు శిక్ష తప్పదని ఆమె హెచ్చరించారు.  

Updated Date - 2020-04-09T09:25:33+05:30 IST