క్రికెట్ అభిమానులకు నిరాశ!
ABN , First Publish Date - 2022-01-24T06:22:07+05:30 IST
బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విశాఖ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
నగరంలో జరగాల్సిన భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్ రద్దు
విశాఖపట్నం(స్పోర్ట్సు), జనవరి 23: బీసీసీఐ తీసుకున్న నిర్ణయం విశాఖ క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య వచ్చే నెల 18న విశాఖలో జరగాల్సిన టీ20 మ్యాచ్ను కోల్కతా తరలించినట్టు ఆదివారం ప్రకటించింది. విశాఖలో చిట్టచివరి అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ 2019 డిసెంబరు 18న భారత్-వెస్టిండీస్ మధ్య జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న వెస్టిండీస్తోనే టీ20 మ్యాచ్ జరుగుతుందని బీసీసీఐ గత ఏడాది ప్రకటించింది. కానీ కొవిడ్ థర్డ్వేవ్ విజృంభించడంతో ఆరు మ్యాచ్లను కేవలం రెండు చోట్లే నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో విశాఖవాసులు నిరాశ చెందారు.