గుర్తు తెలియని వ్యక్తి దారుణహత్య

ABN , First Publish Date - 2021-08-04T08:09:26+05:30 IST

జల్‌పల్లి కార్గో రోడ్డు పక్కన 30ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

గుర్తు తెలియని వ్యక్తి దారుణహత్య
హత్యకు గురైన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

ఘటనాస్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ


పహాడీషరీఫ్‌ ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): జల్‌పల్లి కార్గో రోడ్డు పక్కన 30ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాయితో మోది హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. స్థానికులు చెప్పిన ప్రకారం వివరాలు.. జల్‌పల్లి కార్గోరోడ్డు పక్కన ఓ వ్యక్తి చనిపోయి ఉన్నాడనే స్థానికుల సమాచారం అందుకున్న పహాడీ షరీఫ్‌ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించాడు. వెంటనే క్లూస్‌, డాగ్‌ స్క్వాడ్‌ టీంలను రప్పించి ఆధారాలను సేకరించారు. హత్య జరిగిన స్థలంలో మద్యం బాటిల్స్‌ పడి ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మద్యం తాగి అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లేదా పాతబస్తీ, రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధుల్లో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంచడొచ్చని అనుమానిస్తున్నారు. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య గురించి తెలుసుకున్న ఎల్‌బీ నగర్‌ జోన్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, వనస్థలిపురం డివిజన్‌ ఏసీపీ పురుషోత్తమ్‌ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పరిసర పోలీస్‌ స్టేషన్ల పరిధుల్లో ఎవరైనా తప్పిపోయి ఉంటే వారి కుటుంబ సభ్యులు పహాడీషరీఫ్‌ పోలీసులను సంప్రదించాలన్నారు. హత్య జరిగిన స్థలానికి వచ్చే మార్గాలలోని అన్ని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని, కేసు ఛేదించడానికి ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు.

Updated Date - 2021-08-04T08:09:26+05:30 IST