వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-16T06:57:38+05:30 IST

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు.

వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య

జీడిమెట్ల, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా, పాలకొండ మండలం, వెలగవాడ గ్రామానికి చెందిన చేపూరిపల్లి లక్ష్మీనారాయణ 55) చింతల్‌ ప్రాంతం చంద్రాగనగర్‌లోని కావ్య రెసిడెన్సీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11వ తేదీన అతడి కుమార్తె అరుణ, మనుమరాలు కనిపించకుండా పోయారు. మనస్తాపం చెందిన అతడు ఈనెల 14వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో హెచ్‌ఎంటీ జంగల్‌లో చెట్టుకు ఉరేసుకున్నాడు. జీడిమెట్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సోదరుడు మాట్లాడడం లేదని మనస్తాపంతో.. 

కూకట్‌పల్లి, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): సోదరుడు తనతో మాట్లాడడం లేదని మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్‌పల్లి భాగ్యనగర్‌లోని ద్వారా మహీ మాన్షన్‌ అపార్ట్‌మెంట్‌లో అరిపిరాల గోపాలకృష్ణమూర్తి, కమల(44) దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. కమలకు తన సోదరుడు అంటే ఎంతో ఇష్టం. కొద్దిరోజులుగా వారిద్దరి మధ్య మాటలు లేకపోవడంతో ఆమె బాధపడుతోంది. ఇటీవల జరిగిన బంధువుల పెళ్లిలో కూడా సోదరుడు తనతో మాట్లాడకపోవడంతో ఇంటికి వచ్చి బాధపడింది. సంక్రాంతి పండుగ రోజున కూడా సోదరుడు తనకు ఫోన్‌ చేయలేదని ఏడుస్తుండడంతో కుటుంబ సభ్యులు ఓదార్చారు. అయినా సమాధాన పడని కమల గురువారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చీరకు ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2021-01-16T06:57:38+05:30 IST