సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ నుంచి చైన్‌స్నాచింగ్‌కు..

ABN , First Publish Date - 2021-01-17T06:36:03+05:30 IST

చదివింది ఎంబీ ఏ. జల్సాలకు అలవాటుపడి ఉద్యోగాన్ని వదిలి, చోరీలు చేయాలని భావించాడు.

సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ నుంచి చైన్‌స్నాచింగ్‌కు..

మొదటి చోరీలోనే పట్టుపడిన ఎంబీఏ గ్రాడ్యుయేట్‌

చిక్కడపల్లి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): చదివింది ఎంబీ ఏ. జల్సాలకు అలవాటుపడి ఉద్యోగాన్ని వదిలి, చోరీలు చేయాలని భావించాడు. మొదటి చోరీలోనే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. నూతన సంవత్సరంలో నగరంలో జరిగిన తొలి చైన్‌స్నాచింగ్‌ ఇతడు చేసిందే. శనివారం చిక్కడపల్లి ఏసీపీ చల్లా శ్రీధర్‌... సీఐ పి.శివశంకర్‌రావు, డీఐ హెచ్‌. ప్రభాకర్‌తో కలిసి నిందితుడి వివరాలు వెల్లడించారు. జగిత్యాలకు చెందిన గుళ్లపల్లి రామకృష్ణ(37) ఎంబీఏ చదివాడు. ముషీరాబాద్‌ పోస్టాఫీస్‌ పక్కన నివసిస్తూ సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసేవాడు. జల్సాలకు అలవాటు పడి పని చేయకుం డా  డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. ఈ నెల 7న రాత్రి 8.15 గంటల ప్రాంతంలో  అశోక్‌నగర్‌ స్ర్టీట్‌ నెంబర్‌ ఒకటిలో సుష్మా పురాణిక్‌(65), తన మనుమరాలు అన్విత(6)తో కలిసి పండ్లు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో ఇంటి సమీపంలో మాటు వేసిన రామకృష్ణ ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసు తెంపుకుని పరారయ్యాడు. బాధితురాలు రాత్రి 9.30 గంటల సమయంలో ఫిర్యాదు చేసింది. డీఐ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి బంగారు గొలుసు, హోండాయాక్టివా వాహనం, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్‌ఐ బాలరాజు, వి.కిశోర్‌, కానిస్టేబుళ్లు బాల్‌రెడ్డి, జగదీశ్‌, ఆదినారాయణ, శ్రీకాంత్‌,సంతో్‌షకుమార్‌, సందీప్‌, విశ్వనాథ్‌, సాయికుమార్‌లను ఏసీపీ అభినందించి రివార్డులు ప్రకటించారు.  


Updated Date - 2021-01-17T06:36:03+05:30 IST