నేరమే అధికారమై... ప్రజలను వెంటాడుతుంటే ఊరక కూర్చున్నవాడూ నేరస్థుడే
ABN , First Publish Date - 2021-03-08T08:44:21+05:30 IST
‘‘నేరమే అధికారమై ప్రజలను నేరస్తులను చేసి వెంటాడుతుంటే... ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్తుడే’’ అని విరసం నేత వరవరరావును ఉటంకిస్తూ ఏపీ సీఎం జగన్ మాజీ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఆదివారం చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపుతోంది.
సంచలన ట్వీట్తో పీవీ రమేశ్ దుమారం
అమరావతి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): ‘‘నేరమే అధికారమై ప్రజలను నేరస్తులను చేసి వెంటాడుతుంటే... ఊరక కూర్చున్న నోరున్న ప్రతివాడూ నేరస్తుడే’’ అని విరసం నేత వరవరరావును ఉటంకిస్తూ ఏపీ సీఎం జగన్ మాజీ సలహాదారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఆదివారం చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపుతోంది. జగన్ కోటరీ నుంచి వెళ్లిపోయిన ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదవీ విరమణ తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో సలహాదారుగా సేవలందించిన పీవీ రమేశ్ గత ఏడాది చివరిలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఓ ప్రైవేటు సంస్థలో చేరారు. కొంతకాలంగా మౌనం పాటిస్తూ ఆదివారం ట్వీట్ బాంబు పేల్చారు. దానికి ప్రతిస్పందనలు భారీగా వచ్చాయి. ఇది ఎవరిని ఉద్దేశించి చేశారంటూ కొందరు ప్రశ్నించగా... ఎక్కువమంది మాత్రం ఇది ముఖ్యమంత్రి జగన్కు అన్వయిస్తుందని, తన స్వీయ అనుభవంతోనే రమేశ్ ఇలా రాశారంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఈ నేపథ్యంలో తన ట్వీట్పై వివరణ ఇస్తూ ఆయన సాయంత్రం మరో ట్వీట్ చేశారు. తాను ట్వీట్ చేసిన వరవరరావు కొటేషన్ ఏ ప్రభుత్వానికీ, వ్యక్తులకూ సంబంధించినది కాదని పేర్కొన్నారు.