తమ్ముడి ప్రేమ వ్యవహారం.. అన్న దారుణ హత్య
ABN , First Publish Date - 2020-10-30T17:12:05+05:30 IST
తమ్ముడి ప్రేమ వ్యవహారంలో అన్న దారుణ హత్యకు గురయ్యాడు. షాహినాయత్గంజ్ సీఐ చాంద్బాషా తెలిపిన వివరాల ప్రకారం.. గోషామహల్ చంద్రకిరణ్ బస్తీకి చెందిన తారయ్యకు ఇద్దరు కుమారులు కొండ్ర మధు(22), తమ్ముడు(17). మధు పనిచేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు.
హైదరాబాద్ : తమ్ముడి ప్రేమ వ్యవహారంలో అన్న దారుణ హత్యకు గురయ్యాడు. షాహినాయత్గంజ్ సీఐ చాంద్బాషా తెలిపిన వివరాల ప్రకారం.. గోషామహల్ చంద్రకిరణ్ బస్తీకి చెందిన తారయ్యకు ఇద్దరు కుమారులు కొండ్ర మధు(22), తమ్ముడు(17). మధు పనిచేయకుండా జులాయిగా తిరుగుతున్నాడు. ఆరు నెలల కిత్రం చోరీ కేసులో పట్టుబడి జైలుకు వెళ్లాడు. వారం క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అదే బస్తీకి చెందిన ప్రకాష్(45), శంకర్ (30), కుమార్ (25) అన్నదమ్ములు. ప్రకాష్ కుమార్తెను మధు తమ్ముడు కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయం ప్రకాష్ కుటుంబ సభ్యులకు తెలియడంతో గురువారం ఉదయం ముగ్గురు అన్నదమ్ములు మధు ఇంటికి వెళ్లి మా కుమార్తె జోలికి రావద్దని హెచ్చరించారు. మధు తమ్ముడు వారి మాట లెక్కచేయలేదు. కోపోద్రిక్తులైన ముగ్గురూ అతడిని హత్య చేయాలని పథకం వేశారు. అర్ధరాత్రి ఇంటికి వెళ్లి తలుపులు తీయమన్నారు. కొద్దిసేపటి తర్వాత తలుపులు తీయగానే ముగ్గురు అన్నదమ్ములు లోపలికి వెళ్లి కత్తి, రాడ్డుతో మధు తమ్ముడిపై దాడి చేశారు. పక్క గదిలో నిద్రపోతున్న మధు శబ్దానికి లేచి వారిని అడ్డుకున్నాడు. ముగ్గురూ మధుపై దాడి చేయడంతో అతడి తమ్ముడు ప్రాణభయంతో పారిపోయాడు. మధు తప్పించుకొని బాల్కనీ మీదుగా దూకి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా పట్టుకుని కత్తి, రాడ్డుతో దాడి చేయడంతో అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం నిందితులు ముగ్గురూ.. మధు, అతడి సోదరుడు తమపై దాడి చేశారని షాహినాయత్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మధును హత్య చేసింది ప్రకాష్, శంకర్, కుమార్ అని తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.