తొమ్మిది నెలల్లో తేల్చేస్తాం!

ABN , First Publish Date - 2020-10-06T07:24:35+05:30 IST

నేతలపై కేసులను త్వరితగతిన తేల్చేందుకు దేశంలోని దాదాపు అన్ని హైకోర్టులూ సంసిద్ధత వ్యక్తం చేశాయి. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న ఆర్థిక నేరాలు, క్రిమినల్‌ నేరాల కేసుల సత్వర విచారణకు ఆయా హైకోర్టులు కార్యాచరణను ప్రకటించాయి...

తొమ్మిది నెలల్లో తేల్చేస్తాం!

  • నేతలపై సీబీఐ కేసుల్లో సత్వర విచారణ
  • తెలంగాణ హైకోర్టు కీలక ప్రతిపాదన
  • హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో 17 కేసులు
  • ఇందులో ఏపీ సీఎం జగన్‌పైనే 16
  • నేతలపై కేసుల వివరాలతో వెబ్‌సైట్‌
  • వారెంట్ల జారీకి 2 వారాల్లో ప్రత్యేక బృందం
  • జిల్లాకో ప్రత్యేక కోర్టుకు ఏపీ హైకోర్టు ఓకే 
  • సుప్రీం కోర్టుకు అమికస్‌ క్యూరీ నివేదిక
  • నేడు జస్టిస్‌ రమణ బెంచ్‌ ముందు విచారణ


న్యూఢిల్లీ, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): నేతలపై కేసులను త్వరితగతిన తేల్చేందుకు దేశంలోని దాదాపు అన్ని హైకోర్టులూ సంసిద్ధత వ్యక్తం చేశాయి. ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న ఆర్థిక నేరాలు, క్రిమినల్‌ నేరాల కేసుల సత్వర విచారణకు ఆయా హైకోర్టులు  కార్యాచరణను ప్రకటించాయి. తెలంగాణలో ప్రిన్సిపల్‌ సీబీఐ కోర్టు ముుందు పెండింగ్‌ లో ఉన్న 17 కేసులను 9 నెలల్లోనే తేల్చాలని తెలంగాణ హైకోర్టు ప్రతిపాదించింది. ఇందులో... 16 కేసులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తదితరులు ఎదుర్కొంటున్నవే కావడం గమనార్హం.


ఆర్థిక అక్రమాలకు సంబంధించి జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నమోదు చేసిన 5 అభియోగ పత్రాలు హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్‌ సీబీఐ కోర్టులోనే ఉన్నాయి. ‘‘తెలంగాణలోని అన్ని కోర్టుల్లో ప్రజాప్రతినిధులపై పెండింగ్‌లో ఉన్న కేసుల ప్రగతిని 15 రోజులకోసారి  సమీక్షించి, వేగంగా పరిష్కరించే దిశగా తగిన ఆదేశాలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివేదించారు. ఇక... హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేకంగా ప్రతి శనివారం చేపట్టి,  అవసరమైన చోటల్లా సీనియర్‌ క్రిమినల్‌ న్యాయవాదులను నియమించాలని ప్రతిపాదించారు. నేతలపై ఉన్న కేసులను నిర్దిష్ట కాల వ్యవధిలో తేల్చాలంటూ గతనెల 16వ తేదీన సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఆయా హైకోర్టులు తమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీగా వ్యవహరిస్తున్న సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారియా.. అన్ని హైకోర్టుల కార్యాచరణతో ప్రత్యేక నివేదికను సమర్పించారు. దీనిపై మంగళవారం జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరపనుంది.


సిటింగ్‌, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆంధ్రప్రదేశ్‌లో 131, తెలంగాణలో 143 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ‘‘తెలంగాణ వ్యాప్తంగా నేతలపై ఉన్న కేసుల విచారణ దశతోపాటు, పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలతో ప్రత్యేక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పెండింగ్‌లో ఉన్న అన్ని సమన్లు, వారంట్లను ఇచ్చేలా చూస్తాం. నిందితులకు సమన్లు జారీ చేయడం, నాన్‌ బెయిలబుల్‌ వారంట్లను అమలు చేయడం వంటి బాఽధ్యతలను నోడల్‌ అధికారిగా అదనపు ఎస్పీ ర్యాంకు అధికారికి అప్పగిస్తాం. ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాలని ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌ను కోరుతాం’’ అని  తెలంగాణ హైకోర్టు తెలిపింది. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు అంగీకరించింది.


విశాఖ, కడపలో ప్రత్యేక కోర్టులు 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రత్యేక కోర్టులో ఎంపీలు, ఎమ్మెల్యేలపై 132 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నేతలపై కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి జిల్లాలో ఒక మెజిస్ట్రేట్‌ను ప్రత్యేక కోర్టుగా నియమిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. విశాఖ, కడపలో మరో రెండు ప్రత్యేక కోర్టులను సెషన్స్‌ స్థాయిలో నియమిస్తామని వివరించింది. నేతలపై కేసులను తేల్చేందుకు ప్రతి జిల్లాలో సెషన్స్‌, మెజిస్ర్టీరియల్‌ స్థాయిలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసేందుకు పలు రాష్ట్రాల హైకోర్టులు సుముఖంగా ఉన్నాయని అమికస్‌ క్యూరీ తన తాజా నివేదికలో తెలిపారు. కర్ణాటక, కోల్‌కతాలోని హైకోర్టులు మాత్రం రాష్ట్ర రాజధానుల్లోనే  ప్రత్యేక కోర్టులు ఉండాలని చెప్పాయని ఆయన వివరించారు. కాగా.. ప్రతి కోర్టుకూ నోడల్‌ ప్రాసిక్యూషన్‌ అధికారిని, ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను నియమించాలని హైకోర్టులు సూచించాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాశాయి. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ఏజెన్సీల పరిధిలోని కేసుల విచారణ గురించి కేంద్రం ఇంకా నివేదిక సమర్పించాల్సి ఉందని అమికస్‌ క్యూరీ కోర్టుకు తెలిపారు. నేతలపై ఈ ఏడాది మార్చిలో 4442 కేసులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 4859కి పెరిగింది. ఇందులో 1374 ఉత్తరప్రదేశ్‌కు చెందినవే.


ఇలా చేయాలి...

తెలంగాణ హైకోర్టు ప్రతిపాదించినట్లుగా అన్ని హైకోర్టులు ప్రజాప్రతినిధులపై పెండింగ్‌ కేసులు, విచారణ దశ వివరాలతో  వెబ్‌సైట్లు రూపొందించేలా ఆదేశించాలని అమికస్‌ క్యూరీ విజయ్‌ హన్సారియా తన నివేదికలో సుప్రీంకోర్టుకు సూచించారు. ఆయన చేసిన ఇతర సూచనలివి..

  1. సాక్షులను భద్రమైన వాతావరణంలో ప్రశ్నించేందుకు వీలుగా ప్రత్యేక గదులను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి
  2. ప్రతి కోర్టులోనూ వీడియో కాన్ఫరెన్స్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలి. ఈ ఖర్చులను తొలుత  కేంద్ర ప్రభుత్వం భరించాలి
  3. కేంద్ర ఏజెన్సీలు కేసుల విచారణ ప్రగతి నివేదికను సమర్పించాలి

Updated Date - 2020-10-06T07:24:35+05:30 IST