సరిహద్దుల్లో చల్లారని రగడ

ABN , First Publish Date - 2021-07-31T21:31:24+05:30 IST

అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య ‘సరిహద్దు’ గొడవ మరింత బిగుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిజోరం రాజ్యసభ

సరిహద్దుల్లో చల్లారని రగడ

ఢిల్లీ: అస్సాం, మిజోరం రాష్ట్రాల మధ్య ‘సరిహద్దు’ గొడవ మరింత బిగుస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మిజోరం ఎంపీ కె.వన్లాల్‌వేనా కోసం అస్సాం పోలీసులు శుక్రవారం డిల్లీకి చేరుకున్నారు. అతని నివాసం, మిజోరం హౌస్‌లో గాలించారు. ఎంపీ కనిపించకపోవడంతో ఆయన నివాసానికి సమన్లు అతికించారు. కఛార్‌ జిల్లాలోని దోలాయ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆదివారం హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. అస్సాం పోలీసులు తమ రాష్ట్రంలో మళ్లీ అడుగుపెడితే కాల్చి పారేస్తామని వన్లాల్‌వేనా పార్లమెంట్‌ ఆవరణలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘‘మా పోలీసులను అస్సాం పోలీసులు వెనక్కి తోశారు. వారే ముందు కాల్పులకు ఆదేశాలిచ్చారు. వారు అదృష్టవంతులు. అందరినీ చంపలేదు. మళ్లీ మా ప్రాంతంలోకి అడుగుపెడితే అందరినీ చంపేస్తాం’’ అని వన్లాల్‌వేనా ప్రకటించారు.


అస్సాం-మిజోరం సరిహద్దుల్లో సోమవారం జరిగిన ఘర్షణల్లో ఐదుగురు అస్సాం పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మరోవైపు తమ రాష్ట్ర పౌరులెవరూ మిజోరం వెళ్లొద్దంటూ అస్సాం ప్రభుత్వం గురువారం జారీ చేసిన ప్రయాణ సూచనలు వివాదాస్పదమవుతున్నాయి. ఈ ఉత్తర్వులను అస్సాం ప్రభుత్వం సమర్థించుకుంది. మిజోరం పౌరులు ఏకే-47, ఇతర అత్యాధునిక ఆయుధాలతో తిరుగుతున్నారని.. అందుకే జారీ చేసినట్లు పేర్కొంది. అస్సాం, మిజోరం సరిహద్దులను కలిపే జాతీయ రహదారి 306 వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పహారా కాస్తున్నా, ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రహదారులపై ఆందోళనకారులు లేరని, దిగ్బంధనం కొనసాగడం లేదని అస్సాం అధికారులు శుక్రవారం పేర్కొన్నారు. స్థానికులు మాత్రం రాకపోకలు ఆగిపోయాయని చెబుతున్నారు. 

Updated Date - 2021-07-31T21:31:24+05:30 IST