చున్నీతో ఉరేసుకుని ఇల్లాలు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-08-10T06:06:08+05:30 IST

భర్తతో జరిగిన చిన్నపాటి ఘర్షణతో క్షణికావేశానికి లోనైన ఓ ఇల్లాలు చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని

చున్నీతో ఉరేసుకుని ఇల్లాలు ఆత్మహత్య

రాజేంద్రనగర్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): భర్తతో జరిగిన చిన్నపాటి ఘర్షణతో క్షణికావేశానికి లోనైన ఓ ఇల్లాలు చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆరాంఘర్‌ చౌరస్తాలోని లక్ష్మీనారాయణ విల్లాలో సోమవారం రాత్రి జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సిద్దు సింగ్‌, స్వప్నసింగ్‌ దంపతులు లక్ష్మీనారాయణ విల్లా్‌సలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. వీరి వద్ద సిద్దు సింగ్‌ తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా ఉంటుంది. మంగళవారం ఉద యం స్వప్న సింగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీ వెళ్లాల్సి ఉంది. అందుకోసం సిద్దు సింగ్‌ రైలు టికెట్‌ కూడా బుక్‌ చేశాడు. భార్యను కాశీలో వదిలి తిరిగి హైదరాబాద్‌ రావాలనుకున్నాడు. ఈ విషయమై సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య చర్చ జరిగింది. తనను వదిలి వెంటనే హైదరాబాద్‌ ఎందుకొస్తావని స్వప్నసింగ్‌ భర్తను ప్రశ్నించగా తనకు పనులున్నాయని అతడు చెప్పాడు. డబ్బులు ఇవ్వమని స్వప్నసింగ్‌ అడగ్గా తిరిగి హైదరాబాద్‌ వస్తావు కదా.... డబ్బులెందుకని సిద్దు సింగ్‌ ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సిద్దుసింగ్‌ పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లోని తన గదిలోకి వెళ్లిన స్వప్నసింగ్‌ గడియ పెట్టుకుని చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఎంతకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలు పు పగులగొట్టి చూడగా స్వప్నసింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సిద్దుసింగ్‌ సమాచారంతో రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ ఇంద్రసేనారె డ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 

రాఖీల షాపులో దొంగతనం

మంగళ్‌హాట్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): రాఖీల దుకాణంలో అర్ధరాత్రి దుండగులు చొరబడి పెద్దఎత్తున రాఖీలను ఎత్తుకెళ్లిన ఘటన సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పరిధిలోని బిగ్‌బజార్‌ పక్కన రామారావునగర్‌కు చెందిన శక్తిసంతోష్‌ అనే వ్యక్తి రాఖీల షాపు నిర్వహిస్తున్నాడు. రాఖీల పండగ సమీపంలో రెండు రోజుల క్రితం పెద్దఎత్తున రాఖీలు కొనుగోలు చేసి ఫుట్‌పాత్‌పై ఉన్న తన షాపులో ఉంచాడు. సోమవారం అర్ధరాత్రి రెండు గంటలకు షాపు వద్ద ఉన్న శక్తిసంతోష్‌ అనంతరం అక్కడి నుంచి సమీపంలోని తన ఇంటికి వెళ్లాడు. ఉదయం  వచ్చేసరికి షాపులో ఉన్న దాదాపు లక్ష రూపాయల విలువ చేసే రాఖీలు కనిపించలేదు. వెంటనే సుల్తాన్‌బజార్‌ పీఎ్‌సలో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2022-08-10T06:06:08+05:30 IST