రాజన్న క్షేత్రంలో భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-05-31T06:38:12+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకున్నారు.
వేములవాడ, మే 30 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం సోమవారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి చేరుకున్నారు. సోమవారం సందర్భంగా లఘుదర్శనం అమలు చేయడంతో భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. తలనీలాలు సమర్పించే భక్తులతో ఆలయ కల్యాణకట్ట రద్దీగా మారింది. అనుబంధ ఆలయమైన బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతో బోనం మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు.