నెలాఖరులోగా రాష్ట్రంలో వందశాతం వ్యాక్సినేషన్: సీఎస్

ABN , First Publish Date - 2021-12-04T01:44:16+05:30 IST

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డిసెంబర్ చివరినాటికి 15 లక్షల డోసుల వ్యాక్సిన్ ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు.

నెలాఖరులోగా రాష్ట్రంలో వందశాతం వ్యాక్సినేషన్: సీఎస్

మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డిసెంబర్ చివరినాటికి 15  లక్షల డోసుల వ్యాక్సిన్ ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లు ,అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు ,డి పి వో లు ,తదితరులతో కోవిడ్ వాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించారు.అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గాను సూక్ష్మ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ బాగాలేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, గ్రామాలకు  వెళ్లి అవసరమైతే అక్కడే బస చేసి వాక్సినేషన్ టార్గెట్ పూర్తి చేయాలన్నారు. 


ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలని,వాక్సినేషన్ పై ప్రతిరోజు మీడియాకు సమాచారం అందించాలన్నారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా జిల్లాలలో ప్రత్యేక సమీక్షలను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.వాక్సినేషన్ , కొత్త వేరియంట్ ఒమైక్రాన్ పై క్యాబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర వ్యాప్తంగా 100% వాక్సిన్ కు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు, ఇందుకుగాను అందరూ కృషి చేయాలని కోరారు. నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. వ్యాక్సినేషన్ వేసుకోని వారిని వేసుకునేలా మొబిలైజేషన్ బృందాలను,వాక్సినేషన్ బృందాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలని, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, విఆర్వోలు, అంగన్వాడీ, ఆశలపై బాధ్యత పెట్టాలని చెప్పారు. 


వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, గ్రామాల పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉదయాన్నే ఆ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రిస్టమస్ వరకు ప్రతి అధికారి, ప్రతి రోజు వ్యాక్సిన్ పైనే దృష్టి కేంద్రీకరించాలని, వ్యాక్సిన్ కేంద్రాలు ఉదయం 8 నుండి సాయంత్రం8 వరకు నడవాలని తెలిపారు. రాష్ట్రంలో  వాక్సిన్ కు ఎలాంటి కొరత లేదని ఆయన వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నిర్దేశించిన 24 లక్షల వాక్సిన్ డోసుల లక్ష్యం ఎట్టి పరిస్థితిలో పూర్తి కావాలని సీఎస్ ఆదేశించారు. 

Updated Date - 2021-12-04T01:44:16+05:30 IST