100 మార్కుల ప్రశ్నాపత్రం... 125 మార్కులు సాధించిన విద్యార్థులు!

ABN , First Publish Date - 2021-04-17T16:01:52+05:30 IST

100 మార్కుల పశ్నాపత్రానికి 125 మార్కులు, 75 మార్కుల ప్రశ్నాపత్రానికి...

100 మార్కుల ప్రశ్నాపత్రం... 125 మార్కులు సాధించిన విద్యార్థులు!

కాన్పూర్: 100 మార్కుల పశ్నాపత్రానికి 125 మార్కులు, 75 మార్కుల ప్రశ్నాపత్రానికి 79 మార్కులు రావడం ఎప్పుడైనా చూసుంటారా? కలలో కూడా ఇటువంటిది ఊహించివుండరు. అయితే యూపీలోని కాన్పూర్ సీఎస్జేఎంయూ ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ఇటువంటి వైనం చోటుచేసుకుంది. దీంతో విద్యార్థులు తమకు వచ్చిన మార్కులు చూసి మురిసివాలో, ఏడవాలో తెలియని స్థితిలో చిక్కుకున్నారు. 




ఏదిఏమైనప్పటికీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసినదేనని వారు ఆరోపిస్తున్నారు. అయితే అధ్యాపకులు ప్రశ్నాపత్రాలు దిద్దేటప్పుడు సరిగానే దిద్దారా లేదా? విశ్వవిద్యాలయం రిజల్ట్ విడుదల చేసినప్పుడు ఏదైనా పొరపాటు జరిగిందా? అనేదానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఛత్రపతి షాహ్జీ మహరాజ్ విశ్వవిద్యాయం బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. వీటిని చూసి విద్యార్థులతో పాటు అధ్యాపకుల కళ్లు బైర్లుకమ్మాయి. బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ మూడవ సంవత్సరం ఫలితాలలో మెటీరియల్ అండ్ మెథడ్ సబ్జెక్టులో 100 మార్కుల పశ్నాపత్రానికి సమాధానాలు రాసిన పలువురు విద్యార్థులకు 116 నుంచి 126 మార్కుల వరకూ రావడం విశేషం. ఇదేవిధంగా ఫొటోగ్రఫీ సబ్జెక్టులో 75 మార్కుల ప్రశ్నాపత్రానికి పలువురు విద్యార్థులకు 79 మార్కులు వచ్చాయి. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ అనిల్ యాదవ్ మాట్లాడుతూ పరీక్షా ఫలితాలో గందరగోళం చోటుచేసుకున్నదని, వీటిని సరిదిద్ది మరోమారు ఫలితాలు వెల్లడిస్తామన్నారు. అలాగే ఈ ఉదంతంపై దర్యాప్తు చేపట్టామన్నారు. 

Updated Date - 2021-04-17T16:01:52+05:30 IST