ఈ పరిశ్రమలకే కర్ఫ్యూ మినహాయింపు
ABN , First Publish Date - 2021-05-06T09:10:54+05:30 IST
అత్యవసర, నిత్యం నడవాల్సిన పరిశ్రమలను కర్ఫ్యూ నుంచి మినహాయిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా కంపెనీలన్నీ ఒకటి, రెండు షిఫ్టులకే పరిమితం కా వాలని పేర్కొంది
వైద్యం, వ్యవసాయం, ఆహార సంబంధ సంస్థలకు..సిమెంటు, స్టీల్, ఎరువుల కంపెనీలకు అనుమతి
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): అత్యవసర, నిత్యం నడవాల్సిన పరిశ్రమలను కర్ఫ్యూ నుంచి మినహాయిస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా కంపెనీలన్నీ ఒకటి, రెండు షిఫ్టులకే పరిమితం కా వాలని పేర్కొంది. వాటిల్లో మధ్యాహ్నం 2గంటలకు కార్మికులు పని చేయడాన్ని ఆపేయాలని స్పష్టం చేసింది.
అత్యవసర పరిశ్రమలు...
బల్క్ డ్రగ్, డ్రగ్స్, మందులు, శానిటేషన్ వస్తువులు, ఆక్సిజన్, వైద్య పరికరాలు, వైద్య దుస్తుల తయారీ కంపెనీలు, వీటికి అవసరమైన ముడిసరుకులు ఉత్పత్తి చేసే కంపెనీలు, ఐవీ సెట్స్, ఆక్సిజన్ సరఫరా పైపుల తయారీ, పీపీఈ కిట్లు, సర్జికల్ పరికరాలు, బ్యాండేజ్ క్లాత్, పరిశోధన, ఆయుర్వేద, హోమియోపతి, మందుల తయారీ యూనిట్లు, కొవిడ్-19 కిట్లు, వెంటిలేటర్ల తయారీ, ఆక్సిజన్ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు, మాస్కు లు, పేపర్ నేప్కిన్లు, డైపర్లు, శానిటరీ నేప్కిన్లు, లిక్విడ్ సోప్లు, డిటర్జెంట్లు, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్లు, బ్లీచింగ్ యూనిట్లకు మినహాయింపు.
ఆహార సంబంధ పరిశ్రమల్లో...
పౌలీ్ట్ర, పెంపుడు జంతువులు, పశువుల దాణా తయారుచేసే కంపెనీలు, రైస్మిల్లులు, పప్పు, నూనెల మిల్లులు, డెయిరీ ఉత్పత్తులు, డిస్టిల్డ్ వాటర్ ప్లాంట్లు, రోలర్ ఫ్లోర్ మిల్లులు, వెర్మిసెల్లీ, బిస్కెట్లు, ఫ్రూట్ జ్యూస్లు, ఫ్రూట్ పల్ప్, బేకరీ, ఆక్వా ఫీడ్, పౌలీ్ట్ర ఫీడ్, పశువుల దాణా, ఐస్ ప్లాంట్లు, మిర్చి, పసుపు, ఉప్పు, సుగంధ ద్రవ్యాలు తదితర ఉత్పత్తులు చేసే యూ నిట్లకు మినహాయింపు ఇచ్చారు. పెట్రోలియం రిఫైనరీలు, భారీ స్టీల్ ప్లాం ట్లు, టీఎంటీ బార్ తయారీ కంపెనీలు, సిమెంటు కంపెనీలు, పంచదార మిల్లులు, రసాయన పరిశ్రమలు, మొబైల్ ఫోన్లు, కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్స్ వస్తువులు తయారీ కంపెనీలు, భారీ వస్త్ర పరిశ్రమలకు మినహాయింపు.
రాత్రి కర్ఫ్యూ నుంచి..
రాత్రి, వారాంతపు కర్ఫ్యూ నుంచి టెలికమ్యూనికేషన్లు, ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీల్లో పనిచేసే రాత్రి షిఫ్ట్ ఉద్యోగులు, డాటా సెంటర్, కీలక ఐటీ కేంద్రాలు, ఆర్థిక, రవాణా, వైద్యసేవల్లో పనిచేసేవారు, గిడ్డంగులు, లోడిం గ్, అన్లోడింగ్ల్లో పనిచేసేవారికి మినహాయింపునిచ్చారు. మిగిలిన అన్ని పరిశ్రమల్లోనూ ఫైర్ సేఫ్టీ, యంత్రాలు, కార్మికుల రక్షణకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. వ్యాపారుల మధ్య అత్యవసర, నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు, అమ్మకాలతో పాటు ఈ-కామర్స్ కంపెనీల గిడ్డంగులు, లాజిస్టిక్స్ కార్యక్రమాలకు మినహాయింపు ఉంటుంది.
కార్మికులకు గుర్తింపు కార్డులు
కర్ఫ్యూ సమయాల్లో పనిచేసేందుకు అనుమతించిన కంపెనీలు, యూనిట్లకు సంబంధించిన కార్మికుల వివరాలను ఆయా సంస్థలు సెల్ఫ్ డిక్లరేషన్తో జిల్లా పరిశ్రమల శాఖకు అందించాలి. ఆ ఉద్యోగులు, కార్మికులకు గుర్తింపు కార్డులను కంపెనీల యాజమాన్యాలే ఇవ్వాలి. వాటిని చూపిస్తే పోలీసులు వారిని వెళ్లేందుకు అనుమతించాలి.