టీటీడీ బోర్డు సభ్యులకు దర్శనాల కోటా కట్‌

ABN , First Publish Date - 2021-06-23T08:40:47+05:30 IST

టీటీడీ బోర్డు సభ్యులకు సిఫారసు లేఖలపై ఇచ్చే దర్శనాల కోటాను టీటీడీ మంగళవారం నుంచి కట్‌ చేసింది. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన బోర్డుకు సోమవారంతో రెండేళ్లు పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు

టీటీడీ బోర్డు సభ్యులకు దర్శనాల కోటా కట్‌

చైౖర్మన్‌ కోటా మాత్రం యథాతథం


తిరుమల, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): టీటీడీ బోర్డు సభ్యులకు సిఫారసు లేఖలపై ఇచ్చే దర్శనాల కోటాను టీటీడీ మంగళవారం నుంచి కట్‌ చేసింది. వైవీ సుబ్బారెడ్డి చైర్మన్‌గా ఏర్పాటైన బోర్డుకు సోమవారంతో రెండేళ్లు పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చైర్మన్‌ కోటా టికెట్లను మాత్రం టీటీడీ కొనసాగించింది. సభ్యుల కొనసాగింపుపై ప్రభుత్వం నుంచి జీవో వచ్చేవరకు సిఫారసు లేఖలపై దర్శనాలు కేటాయించకూడదని నిర్ణయించింది. 2019 జూన్‌ 21న టీటీడీ బోర్డు చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 3నెలల తర్వాత సెప్టెంబరు 23న పాలకవర్గ సభ్యులు బాధ్యతలు తీసుకున్నారు. చైర్మన్‌గా సుబ్బారెడ్డి నియామకమై రెండేళ్లు పూర్తయినప్పటికీ సభ్యులకు ఇంకా 3నెలల సమయం ఉంది. అయితే చైర్మన్‌ నియామకమైన తేదీనే వారి పదవీకాలం కింద పరిగణిస్తారు. ఈ క్రమంలోనే బోర్డు సభ్యుల పదవీకాలం సోమవారంతో పూర్తయింది.  


2గంటల్లోనే ‘ప్రత్యేక’ టికెట్ల కోటా పూర్తి 

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఆన్‌లైన్‌లో విడుదలైన 2గంటల వ్యవధిలోనే పూర్తయింది. జూలై నెలకు సంబంధించి రోజుకు 5వేల చొప్పున రూ.300 దర్శన టికెట్లను టీటీడీ మంగళవారం ఉదయం 9గంటలకు ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. టికెట్లు విడుదలైన వెంటనే బుక్‌ చేసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో ఉదయం 11 గంటలకే కోటా మొత్తం పూర్తయింది.  


ఆంధ్రజ్యోతి, తిరుమల : తిరుమల జ్యేష్ఠాభిషేక ఉత్సవాలు మంగళవారం శాస్ర్తోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా సాయంత్రం ఉత్సవమూర్తులకు వజ్రకవచాన్ని అలంకరించారు. సహస్రదీపాలంకరణ సేవ అనంతరం ఉత్సవమూర్తులు మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.  

Updated Date - 2021-06-23T08:40:47+05:30 IST