వడ్డీ రేట్లలో కోత!
ABN , First Publish Date - 2020-07-27T08:51:34+05:30 IST
దేశీయంగా వడ్డీ రేట్లు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 4-6 తేదీల
- రెపో రేటు 0.25 శాతం తగ్గించే చాన్స్
- ఆగస్టు 4 నుంచి ఆర్బీఐ ఎంపీసీ భేటీ
- రుణాల పునర్ వ్యవస్థీకరణపైనా నిర్ణయం
ముంబై : దేశీయంగా వడ్డీ రేట్లు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగస్టు 4-6 తేదీల మధ్య జరిగే ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) భేటీలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎంపీసీ సమావేశంలో రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం), రివర్స్ రెపో రేటు 35 బేసిస్ (0.35 శాతం) పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనా. బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటును రెపో వడ్డీ రేటు, బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఉంచే మిగులు నిధులపై ఆర్బీఐ ఇచ్చే వడ్డీ రేటును రివర్స్ రెపో వడ్డీ రేటుగా వ్యవహరిస్తారు. కొవిడ్-19, లాక్డౌన్తో నీరసించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు వడ్డీ రేట్లు మరింత తగ్గించడం తప్ప ఆర్బీఐకి మరో మార్గం లేదని భావిస్తున్నారు.
భయపెడుతున్న ద్రవ్యోల్బణం
కాగా గత మూడు నెలలుగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం కోరలు చాస్తోంది. జూన్ నెలలో ఆరు శాతం దాటిపోయి 6.09 శాతంగా నమోదైంది. ప్రభుత్వం నిర్ణయించిన 2-6 శాతం లక్ష్యం కంటే ఇది కొద్దిగా ఎక్కువ. దీంతో రెపో రేటు తగ్గింపునకు ఎంపీసీ ఇష్టపడుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వరుణుడు కరుణించడంతో ఆగస్టు నాటికి రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ నేలచూపులు చూసే అవకాశం ఉన్నందున ఆగస్టు 6న ప్రకటించే ద్రవ్య, పరపతి సమీక్షలో రెపో రేటు మరో పావు శాతం తగ్గించేందుకే మొగ్గుచూపొచ్చని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి.
రుణ పునర్ వ్యవస్థీకరణ
కరోనా కష్టాలతో పారిశ్రామిక, ఆర్థిక రంగాలు కుప్పకూలాయి. కొన్ని కంపెనీలైతే తీసుకున్న రుణాలు చెల్లించే పరిస్థితిలో లేవు. 2009 ఆర్థిక సంక్షోభ సమయంలోలా రుణ పునర్ వ్యవస్థీకరణతో ఆదుకుంటే తప్ప ప్రస్తుత గండం నుంచి గట్టెక్కే పరిస్థితి లేదని అసోచామ్తో సహా అనేక పారిశ్రామిక, వాణిజ్య మండళ్లు ఇప్పటికే స్పష్టం చేశాయి. బ్యాంకర్లూ దీన్ని సమర్ధిస్తున్నారు. దీంతో రుణ పునర్ వ్యవస్థీకరణపైనా ఆర్బీఐఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.