యాప్ పేరుతో లూటీ.. లక్షలు కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు
ABN , First Publish Date - 2021-06-05T19:14:31+05:30 IST
మొబైల్ యాప్స్లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభాలు
- బ్లాక్ ఫంగస్ మందుల పేరుతో కూడా...
హైదరాబాద్ సిటీ/హిమాయత్ నగర్ : మొబైల్ యాప్స్లో పెట్టుబడి పెడితే రెండింతలు లాభాలు వస్తాయని, కొత్తవాళ్ళని చేర్పిస్తే వాళ్ళ పెట్టుబడిలో కూడా కమీషన్ వస్తుందని సైబర్ కేటుగాళ్లు ప్రచారం చేస్తున్నారు. మూడు నెలల కాలంలో వీరి ఉచ్చులో చిక్కి ఎంతో మంది ఉన్నదంతా పోగొట్టుకున్నారు. తాజాగా నగరానికి చెందిన ఇబ్రహీం అహ్మద్ తన భార్యతో పలు విడతలుగా మొత్తం రూ. 3.6 లక్షలు పెట్టుబడి పెట్టించాడు. వారం రోజుల పాటు ఓపెన్ అయిన యాప్ తర్వాత తెరుచుకోలేదు. యాప్ నిర్వాహకులమంటూ అంతకుముందు ఫోన్లో మాట్లాడిన నెంబర్ పని చేయడం లేదు. దీంతో మోసపోయామని గ్రహించిన ఇబ్రహీం శుక్రవారం సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశాడు.
బ్లాక్ ఫంగస్ మందుల పేరుతో...
బ్లాక్ ఫంగస్ మెడిసిన్ కోసం ఇండియా మార్ట్వెబ్ సైట్లో వెతికిన ఓ వ్యక్తి నుంచి సైబర్ కేటుగాళ్లు లక్షకు పైగా కాజేశారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఫంగస్ లక్షణాలు కనిపించడంతో కంచన్ బాగ్కు చెందిన రియాజ్ ఇండియా మార్ట్వెబ్ సైట్లో సంబంధిత మెడిసిన్ సప్లయర్ కోసం వెతికాడు. ఒక వ్యక్తి రియాజ్కు ఫోన్ చేసి మెడిసిన్ కోసం ముందుగా డబ్బులు చెల్లించాలని చెప్పడంతో రూ. 1.25 లక్షలు రియాజ్ బదిలీ చేశాడు. ఆ మరుక్షణం నుంచే ఫోన్ స్విచాఫ్ వస్తుండడంతో మోసపోయానని గ్రహించిన రియాజ్ సైబర్ క్రైంఠాణాలో ఫిర్యాదు చేశాడు.