పోలీసు ఠాణాల్లోనూ.. సైబర్ నేరాలపై ఫిర్యాదులు
ABN , First Publish Date - 2021-10-27T08:12:41+05:30 IST
సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో.. సీసీఎ్సలలోని సైబర్క్రైమ్ పోలీసు ఠాణాలకు ఫిర్యాదుల తాకిడి తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీ సు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు.
- రూ. లక్షన్నరలోపు మోసాలకు మాత్రమే
- ఆ మొత్తం దాటితే సైబర్క్రైమ్ పీఎ్సలోనే కేసులు
- సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 26 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో.. సీసీఎ్సలలోని సైబర్క్రైమ్ పోలీసు ఠాణాలకు ఫిర్యాదుల తాకిడి తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీ సు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల పోలీస్స్టేషన్లలోనూ సైబర్క్రైమ్ ఫిర్యాదులను స్వీకరించవచ్చంటూ ఆదేశాలు జారీ చేశారు. ఎస్హెచ్వోలు సైబర్ నేరాలపై దర్యాప్తు చేయవచ్చని పేర్కొన్నారు. రూ. 1.50 లక్షలలోపు మోసాలపై బాధితులు స్థానిక ఠాణాల్లో ఫిర్యాదు చేయవచ్చని, ఆయా పోలీస్స్టేషన్ల సిబ్బంది వాటిని తిరస్కరించరాదని ఇటీవల సైబర్ నేరాలపై జరిగిన సమీక్షలో ఆదేశించారు. ఇందుకోసం ఠాణాల్లో ప్రత్యేకంగా సైబర్సెల్స్ను ఏర్పాటు చేయాలన్నారు. రూ. 1.50 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో జరిగిన మోసాలపై సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లోనే ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి పెద్దగా ఉండడం.. రూ. వేలల్లో జరిగే మోసాలపైనా ఫిర్యాదుకు బాధితులు సుదూర ప్రాంతాల నుంచి కమిషనరేట్కు రావడం.. సైబర్క్రైమ్ పోలీస్స్టేషన్పై ఫిర్యాదుల భారం పెరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ వివరించారు.