Shilpa Chowdary Case : ఆ ఒక్క ప్రశ్నకు నో ఆన్సర్...
ABN , First Publish Date - 2021-12-04T08:22:26+05:30 IST
కోట్ల రూపాయల ఆర్థిక మోసంలో అరెస్టయిన శిల్పాచౌదరి.. పోలీసు విచారణలో...
- డాబూ.. దర్పం.. కంటతడి
- పోలీసు విచారణలో శిల్పాచౌదరి తీరు
- తొలుత నోరు మెదపని వైనం
- పోలీసులు ఆధారాలను చూపగానే ఒక్కొక్కటిగా
- వివరాల వెల్లడి
- తొలిరోజు కస్టడీ పూర్తి
హైదరాబాద్ సిటీ/ నార్సింగ్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): కోట్ల రూపాయల ఆర్థిక మోసంలో అరెస్టయిన శిల్పాచౌదరి.. పోలీసు విచారణలో తన డాబూ.. దర్పాన్ని ప్రదర్శించారు. పలు సందర్భాల్లో కంటతడి పెట్టారని తెలిసింది. న్యాయస్థానం అనుమతితో పోలీసులు శిల్పాచౌదరిని రెండు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి రోజు ఆమెను చంచల్గూడ మహిళా జైలు నుంచి నార్సింగ్లోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(ఎ్సవోటీ) కార్యాలయానికి తరలించారు. అక్కడ దర్యాప్తు అధికారులు-- నార్సింగ్ ఇన్స్పెక్టర్, అదనపు ఇన్స్పెక్టర్-- మహిళా పోలీసుల సమక్షంలో ఆమెను విచారించారు. తొలుత పోలీసులు మోసాల చిట్టాపై ప్రశ్నించగా.. శిల్ప విలపిస్తూ.. ‘‘నాకేం తెలియదు’’ అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు తమకు వచ్చిన ఫిర్యాదుల చిట్టాను.. ఆమె కోట్లు వసూలు చేసినట్లు ఆధారాలను ముందు పెట్టారు. కాల్డేటా రికార్డులను.. ఎవరితో ఎప్పుడు? ఎంతసేపు మాట్లాడారనే చిట్టాను తీశారు. దీంతో ఆమె ఒక్కో విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. తనది మెదక్ జిల్లా అని.. ఓ బాబు ఉన్నాడని చెప్పినట్లు తెలిసింది. బాధితుల వివరాలను పోలీసులు చెబుతూ.. ‘‘ఇంకా చెప్పమంటారా? మీరే చెబుతారా?’’ అని ప్రశ్నించడంతో.. ఆమె అన్ని వివరాలు పూసగుచ్చినట్లు చెప్పారని తెలిసింది.
‘‘కిట్టీ పార్టీల పేరుతో నేనేం మోసం చేయలేదు. రాజకీయ, సినీ ప్రముఖులు తమ బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకే నా దగ్గర పెట్టారు. అందులో చాలా మంది డబ్బును అప్పుగా ఇవ్వగా.. మరికొందరు తమ బ్లాక్మనీని పెట్టుబడులుగా పెట్టి.. నా ద్వారా వైట్గా మార్చుకోవాలనుకున్నారు’’ అని శిల్పాచౌదరి వివరించినట్లు సమాచారం. ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టారు? అనే ప్రశ్నకు మాత్రం శిల్ప సమాధానాలను దాటవేశారని పోలీసులు చెబుతున్నారు. విచారణ జరుగుతున్నంత సేపు శిల్ప తన స్టేటస్, పరువు గురించి పదేపదే ప్రస్తావించినట్లు సమాచారం. సాయంత్రం 6 గంటల వరకు శిల్పను విచారించిన పోలీసులు.. ఆమెకు ఎస్వోటీ కార్యాలయంలో అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న ఓ గదిని కేటాయించారు. ఆమెకు భద్రతగా మహిళా కానిస్టేబుళ్లను నియమించారు.