కూతుర్ని ఒడ్డుకు చేర్చి...ప్రాణాలొదిలిన తండ్రి

ABN , First Publish Date - 2021-04-21T10:07:02+05:30 IST

కూతురి ప్రాణాలకు తన ప్రాణాలను పణంగా పెట్టాడు ఆతండ్రి. ఆవేశంలో కాల్వలో దూకిన కుమార్తెను క్షేమంగా ఒడ్డుకు చేర్చి తాను తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరంలో మంగళవారం చోటుచేసుకున్న సంఘటన వివరాలు..

కూతుర్ని ఒడ్డుకు చేర్చి...ప్రాణాలొదిలిన తండ్రి

తుని, ఏప్రిల్‌ 20: కూతురి ప్రాణాలకు తన ప్రాణాలను పణంగా పెట్టాడు ఆతండ్రి. ఆవేశంలో కాల్వలో దూకిన కుమార్తెను క్షేమంగా ఒడ్డుకు చేర్చి తాను తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం హంసవరంలో మంగళవారం చోటుచేసుకున్న  సంఘటన వివరాలు.. హంసవరం గ్రామానికి రావాడ నిర్మల (విమల) స్థానిక మోడల్‌ స్కూలులో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జయబాబు, తల్లి అప్పలకొండ ఉపాధి పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చారు. విమల కళాశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండడంతో ఎందుకు వెళ్లలేదని మందలించారు. దీంతో కోపగించుకున్న ఆమె తాను చనిపోతానంటూ పరిగెడుతూ వెళ్లి సమీపంలో ఉన్న పోలవరం కాల్వలో  దూకింది. ఆమె వెనకే వెళ్లిన తండ్రి జయబాబు కూడా కాల్వలో దూకాడు. కుమార్తెను పట్టుకుని ఈదుకుంటూ జాగ్రత్తగా  ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే అలసిపోయిన అతను ఉన్నట్టుండి కాల్వలోకి జారిపోయాడు. అక్కడకు చేరుకున్న స్థానికులు విమలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాల్వలో వెతగ్గా జయబాబు శవమై తేలాడు.  తుని రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-21T10:07:02+05:30 IST