రైతుల ఖాతాల్లో నగదు జమకు చర్యలు
ABN , First Publish Date - 2021-01-17T06:16:43+05:30 IST
రైతుల ఖాతాల్లో నగదు జమకు చర్యలు
జేసీ మాధవీలత
విజయవాడ సిటీ: జిల్లాలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం చెల్లింపులు వారి ఖాతాల్లో త్వరితగతిన జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని జేసీ కె.మాధవీలత తెలిపారు. తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం నిర్వహించిన డయల్ యువర్ జేసీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇప్పటివరకు 3,63,067 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామని జేసీ తెలిపారు. 35,652 మంది రైతులకు వారి బ్యాంక్ ఖాతాల్లో రూ.407.27 కోట్లను జమ చేశామన్నారు. ఘంటశాల మండలానికి చెందిన లక్ష్మీ ప్రసూనాంబ, పామర్రు మండలానికి చెందిన దేవిరెడ్డి, పూర్ణచంద్రారెడ్డి, ఉంగుటూరు మండలానికి చెందిన సత్యనారాయణ, మొవ్వ మండలానికి చెందిన బొల్ల శ్రీనివాసరావు, వి.వి.ప్రసాద్ పమిడిముక్కలకు చెందిన కె.వెంకటేశ్వరరావు తడిసిన, రంగు మారిగ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జేసీని కోరారు. ధాన్యం నమూనాలను రైతుల నుంచి సేకరించి, పరీక్షించి ధాన్యం కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు జేసీ ఆదేశాలు జారీ చేశారు. పౌరసరఫరాల జిల్లా మేనేజర్ కె.రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.