పూట గడవక.. అల్లాడిపోతోన్న అసంఘటిత రంగం

ABN , First Publish Date - 2020-09-21T13:23:33+05:30 IST

సామాన్యుల బతుకుల్లో కరోనా.. కల్లోలం సృష్టిస్తోంది. ఒకవైపు వైరస్‌ వణికిస్తోండగా.. మరోవైపు పనులు లేక పూట గడవక చిరు ద్యోగుల నుంచి కూలీల వరకు అల్లాడిపోతున్నారు. కరోనా లాక్‌ డౌన్‌తో జిల్లాలో అసంఘటిత రంగం కుదేలైంది. ఆ రంగంపై ఆధారపడిన వేలాది కార్మికులు, ఉద్యోగుల బతుకు భారమైంది. జిల్లా నుంచి

పూట గడవక.. అల్లాడిపోతోన్న అసంఘటిత రంగం

లాక్‌డౌన్‌ అనంతరం కోలుకోని కార్మికులు

కరోనాతో స్వస్థలాలకు కార్మికులు, కూలీలు

గ్రామాల్లో వ్యవసాయ పనులతో కొంత ఊరట

చిరు ఉద్యోగులపై పెరిగిపోతోన్న అప్పుల భారం  

చేయూత కోసం ఎదురు చూస్తున్న కుటుంబాలు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): సామాన్యుల బతుకుల్లో కరోనా.. కల్లోలం సృష్టిస్తోంది. ఒకవైపు వైరస్‌ వణికిస్తోండగా.. మరోవైపు పనులు లేక పూట గడవక చిరు ద్యోగుల నుంచి కూలీల వరకు అల్లాడిపోతున్నారు. కరోనా లాక్‌ డౌన్‌తో జిల్లాలో అసంఘటిత రంగం కుదేలైంది. ఆ రంగంపై ఆధారపడిన వేలాది కార్మికులు, ఉద్యోగుల బతుకు భారమైంది. జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన కుటుంబాలు కరోనాతో స్వస్థలాలకు చేరిన వారి జీవనం కడుదుర్భ రంగా మారింది. అప్పులతో ఇంత కాలం నెట్టుకు వచ్చారు. అయితే ఇక తమ పరిస్థితి ఏమిటో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఆయా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. కరోనా ముందులా వలస వెళ్లలేక.. ఉన్న దగ్గర పనిలేక విలవిలలాడిపో తున్నారు. నెలల తరబడి జీతాలు లేక అప్పులిచ్చే వారు లేక అల్లాడిపోతున్న కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురు చూస్తు న్నా.. వీరి గోడు ఆలకించేవారే లేకుండా పోతున్నారు.   


కరోనా సామాన్యుల జీవనాధారంపై కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. ప్రైవేట్‌ రంగంపై ఆ ప్రభావం అంతా ఇంతా కాదు. వేలాది కుటుంబాలు పోషణ కరువై రోడ్డున పడ్డాయి. సంపాదన లేక పూట గడవక పేదలు తల్లడిల్లిపోతున్నారు. కరోనా లాక్‌డౌన్‌తో జిల్లాలో అసంఘటిత రంగంలో ఉన్న వేల మంది ఉపాధి కోల్పోయారు.  జిల్లా నుంచి ఎక్కువగా నిర్మాణ రంగాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు, నగరాలకు వలస వెళ్తారు. కరోనాతో వీరంతా జిల్లాకు తిరిగి వచ్చారు. జిల్లాకు చెందిన వారు అత్యధికంగా ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, తెలం గాణ ప్రాంతాల్లో తాపీ కార్మికులుగా, మేస్త్రీలుగా, వాహన డ్రైవ ర్లుగా పని చేస్తూ జీవనోపాధి పొందుతూ ఉండేవారు. కరోనా లాక్‌డౌన్‌తో వారంతా ఆయా ఉపాధి కోల్పోయి    స్వస్థలాలకు కుటుంబాల సహా తిరిగి వచ్చేశారు. మరికొంతమంది చిరు ద్యోగులుగా జీవనం సాగిస్తూ ఉండేవారు. అయితే కరోనా ఆర్థిక కష్టాలతో ఆయా సంస్థలు మూతతో.. ఉద్యోగుల తొలగింపుతో ఎందరో నిరుద్యోగులుగా  మారారు. వీరే కాక చిన్నచిన్న వ్యాపా రాలు చేసుకుంటూ జీవనం సాగించేవారిపై కూడా కరోనా లాక్‌ డౌన్‌ ఆర్థిక కష్టాల్లో చిక్కుకునేలా చేసింది. వివిధ విద్యాసంస్థల్లో పని చేసే బోధన, బోధనేతర రంగాలకు చెందిన వారు కూడా ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు ఆరేడు నెలలుగా జీతాలు లేక అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. అద్దెలు కట్టలేక.. జీవనం సాగిం చలేక ఇలాంటి వారంతా కూడా గ్రామాల బాట పట్టారు. మరి కొందరేమో కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు ఇలా అమ్ము కుంటూ అతికష్టంగా జీవనం సాగిస్తున్నారు.  


ఐదారు నెలల నుంచి పనులు లేవు..

ఇతర ప్రాంతాలకు వలస వెల్ళిన కూలీలు తిరిగి స్వగ్రామాల కు చేరుకుని సుమారుగా ఐదు నెలలు పూర్తయ్యాయి. గత ఐదు నెలలుగా కూలీలకు పనులు లేవు. దీంతో పూట గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నరసరావుపేట ప్రాంతం నుంచి బెంగళూరు, హైదరాబాద్‌, తిరుపతి వంటి ప్రాంతాలకు సిమెంటు పనులకు కూలీలు వలసలు వెళ్తూంటారు. తిరిగి వచ్చిన వారికి పనులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాంతాలకు ఉద్యోగాల కోసం వెళ్లి ఆ ఉద్యోగం పోయి తిరిగి వచ్చిన వారు కూడా చేసేందుకు పనులు లేక అల్లాడుతున్నారు.  పూటగడవని పరిస్థితుల్లో కూలీలు, ఉద్యోగులు ఐదు నెలలుగా విలవిలలాడిపోతున్నారు. స్వగ్రామాలకు విచ్చేసిన నిరుద్యోగులంతా ఇళ్ళ వద్దనే ఉంటున్నారు. కరోనా ఎప్పుడు పోతుందా.. తిరిగి తమకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేసే వారు ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్నారు.   తాము నివాస ఉన్న ప్రాంతంలో పనులు లేక, పనులున్న ప్రాంతాలకు వెళ్లడానికి సరైన రవాణా సౌకర్యం లేక మరికొందరు ఇబ్బంది పడుతున్నారు.  50 ఏళ్లపైబడిన కార్మికులు కరోనా ప్రభావంతో బయటికి రాని పరిస్థితి నెలకొంది.  పల్నాడులో ఇలా ఎక్కువ మంది నిరుద్యోగ యువత ఉపాధిలేక దొరికిన పనికి వెళ్లేందుకు సంసిద్దంగా ఉన్నా కరోనా ప్రభావంతో ఏ ఉపాధిలేక పోవటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. పల్నాడు ప్రాంతంలో సుమారు 500 మందికిపైగా హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖ పట్నాల్లో ప్రైవేట్‌ కంపెనీల్లో పనిచేస్తూ లాక్‌డౌన్‌ కారణంగా సొంతూరుకు వచ్చారు. దొరికిన  పనికి వెళ్లేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నా అందరికీ ఉపాధి దొరకడంలేదు.


ఆదుకున్న వ్యవసాయ రంగం

ఇతర రాష్ట్రాలు, నగరాల నుంచి ఉపాధి కోల్పోయి వలస వచ్చిన వారిని వ్యవసాయ రంగం ఆదుకుంది. రాష్ట్రాలు, నగరాలకు వలస వెళ్లి తిరిగి వచ్చిన వారంతా స్వగ్రా మాలకు వచ్చారు. వీరిందరినీ గ్రామాలు అక్కున చేర్చుకున్నాయి. అంతేగాక ఉపాధి కల్పించాయి. వ్యవసాయ పనులతో వారంతా ఎంతో కొంత సంపాదిస్తూ జీవనం సాగిస్తున్నారు. బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాలలో ప్రస్తుతం వ్యవసాయ పనులు ఉండటం వల్ల కొంత ఊరట లభిస్తున్నది. పనులు ఉన్ననాడు చేసుకుంటున్నారు.. లేని రోజుల్లో ఖాళీగా ఉంటున్నారు. భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న కూలీలు స్థానికంగా దొరుకుతున్న అరకొర పనులు చేసుకుంటున్నారు.  


నాడు డ్రైవర్‌.. నేడు పొలం పనులు: కామేపల్లి గోపీకృష్ణ, సత్తెనపల్లి

గుంటూరులోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో డ్రైవర్‌గా పనిచేసే వాడిని. నెలకు రూ.20 వేలు జీతం ఇచ్చేవారు. లాక్‌డౌన్‌తో కళాశాల మూ తపడింది. దీంతో స్వగ్రామా నికి తిరిగి వచ్చేశా. ఇక్కడే పొలం పనులు చేసు కుంటూ జీవనం సాగి స్తున్నాను.


ఐదు నెలల నుంచి పని లేదు: షేక్‌ నాసర్‌ వలి, పుల్లడిగుంట

35 ఏళ్లు నుంచి తాపీ మేస్ర్తీగా పనిచేస్తున్నాను. రోజుకు 600- 800 కూలి వచ్చేది. గతం లో గుంటూరు, నెల్లూరు, తిరుపతి వంటి  నగరా లలో పనులకు వెళ్లే వాడిని.  పనులు బాగా దొరికాయి. లాక్‌డౌన్‌తో ఐదు నెలల నుంచి పనులు లేవు. స్వ్రగామంలోనే పొలం పనులు చేసుకుంటూ జీవిస్తున్నాను.   


జీవనం దుర్భరం..: సిద్ధయ్య, పొన్నూరు

పొన్నూరు పరిసర ప్రాం తాలకు వెళ్లి పరుపులు, దిం డ్లు దూది ఏకి జీవనం సా గించేవాడిని. కరోనా మహమ్మారితో బయటకు వెళ్లలేక పోతున్నాను. ఆర్థిక సమస్య లతో జీవనం దుర్భరంగా మారింది. ఆడపా దడ పా వ్యవసాయ పనులకు పోతున్నాను. ఆ వచ్చే నగదుతో కు టుంబం గడుపుకుంటున్నాను. 

Updated Date - 2020-09-21T13:23:33+05:30 IST