దళితుడు రాసినందుకే రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుండు
ABN , First Publish Date - 2022-02-10T05:24:00+05:30 IST
దళితుడు రాసిన రాజ్యాంగం కాబట్టే రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.
- కేసీఆర్కు వ్యతిరేకంగా రేపు గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద దీక్షలు
-12న హైదరాబాద్లో అన్ని పార్టీలు, అన్నివర్గాలతో
రౌండ్ టేబుల్ సమావేశం
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ
జడ్చర్ల, ఫిబ్రవరి 9 : దళితుడు రాసిన రాజ్యాంగం కాబట్టే రాజ్యాంగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన కేసీఆర్ వైఖరికి, రాజ్యాంగ స్ఫూర్తి, జీయర్స్వామి బోధనలకు విరుద్ధంగా వ్యవహరించిన చిన్నజీయర్ స్వామిలకు నిరసనగా బుధవారం అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాటలపై దమ్ము, ధైర్యం ఉంటే రాబోయే ఎన్నికల వరకు ప్రతీ రోజు అదే అంశంపై మాట్లాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు సవాల్ విసిరారు. జయంతి, వర్ధంతి సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి ఏనాడైనా కేసీఆర్ నివాళులు అర్పించారా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని, బహిరంగంగా కేసీఆర్ క్షమాపణ చెపాల్పని డిమాండ్ చేశారు. దళితులు, బడుగు బలహీనవర్గాలందరూ సమానమేనని బోధించిన రామానుజాచార్యుల భావాలకు విరుద్ధంగా చినజీయర్ వ్యవహరిస్తు న్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా ఈ నెల 11న అన్ని గ్రామపంచాయతీల ముందు దీక్షలు చేపట్టాల ని కోరారు. ఈ నెల 12న అన్ని పార్టీలతో, అన్ని వర్గాలతో హైదరాబాద్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించిన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ప్రజాసంఘాల నాయకులు జంగయ్య మాదిగ, ఎడ్లబాలవర్దన్గౌడ్, కరాటే శ్రీను, ఆనంద్, నాగరాజు, శ్రీనివాస్ బహద్దూర్, దగ్గులబాలరాజు, నడిమింటి శ్రీనివాసులు, కొంగళి శ్రీకాంత్, చెన్నకేశవులు, యాదయ్య, విజయ్కుమార్, భీంరాజ్, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.