మ్యుటేషన్ సమస్యలను పరిష్కరించాలి
ABN , First Publish Date - 2021-01-18T05:22:00+05:30 IST
జిల్లాలోని వివిధ తహసీల్దార్ కార్యాలయాలలో పెండింగ్లో ఉన్న 329 మ్యుటేషన్ సమస్యలు పరిష్కరించాలని మండల అధికారులకు కలెక్టర్ రవి ఆదేశాలు జారీ చేశారు.
జగిత్యాల (ఆంద్రజ్యోతి), జనవరి 16: జిల్లాలోని వివిధ తహసీల్దార్ కార్యాలయాలలో పెండింగ్లో ఉన్న 329 మ్యుటేషన్ సమస్యలు పరిష్కరించాలని మండల అధికారులకు కలెక్టర్ రవి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ మండలాల తహసీల్దార్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న భూ సమస్యల వివరాలు తెలుసుకున్నారు. ధరణి పోర్టల్లో చేర్చవలసిన రెవెన్యూ అంశాలు, పెండింగ్లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో పెండింగ్లో ఉన్న మ్యుటేషన్ వివరాలను వివిధ రికార్డులను సరిచూసుకొని కలెక్టర్ కార్యాలయంలో నివేదిక అందజేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో నిషేధిత భూముల వివరాలు, పొరపాటున నిషేదిత భూముల జాబితాలో నమోదైన భూముల వివరాలు పంపాలని ఆదేశించారు. కంపెనీలు సంస్థలు, ఎన్ఆర్ఐ పెండింగ్ కేసుల వివరాలను పంపాలని తహసీల్దార్లకు కలెక్టర్ ఆదేశాలను జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాలుపడినట్లు తన దృష్టకి వచ్చినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్ రాజేశం పాల్గొన్నారు.