దమ్ముంటే రండి.. అభివృద్ధి నిరూపిస్తాం

ABN , First Publish Date - 2021-08-02T05:04:46+05:30 IST

మీకు దమ్ముందా... టీడీపీ హయాంలో అభివృద్ధి నిరూపణకు నిజనిర్ధారణ కమిటీతో మేము వస్తాం... మీరు వస్తారా అంటూ టీడీపీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణచైతన్య వైసీపీ నాయకులకు సవాల్‌ విసిరారు.

దమ్ముంటే రండి.. అభివృద్ధి నిరూపిస్తాం
బుచ్చి టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు.

=========

  

వైసీపీ నేతలకు సవాల్‌ విసిరిన టీడీపీ 


బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 1: మీకు దమ్ముందా... టీడీపీ హయాంలో అభివృద్ధి నిరూపణకు నిజనిర్ధారణ కమిటీతో మేము వస్తాం... మీరు వస్తారా అంటూ టీడీపీ పార్లమెంటరీ అధికార ప్రతినిధి చెముకుల కృష్ణచైతన్య వైసీపీ నాయకులకు సవాల్‌ విసిరారు. ఆదివారం బుచ్చి టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఎంవీ. శేషయ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 82 పంచాయతీలలో అభివృద్ధిపై ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్నకుమార్‌రెడ్డి, రెండుసార్లు గెలిచిన పోలంరెడ్డి ఇద్దరిలో ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో ప్రజలే చెబుతారన్నారు. సీఎంగా చంద్రబాబు హయాంలో పెన్నాడెల్టా చైర్మన్‌గా ఉన్న ఎర్రంరెడ్డి గోవర్ధన్‌రెడ్డికి, ఎమ్మెల్యే పోలంరెడ్డి చేసిన అభివృద్ధి తెలియదా? అని ప్రశ్నించారు. రేబాల, పంచేడులో ప్రతి సీసీ రోడ్ల అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందన్నారు. పంచేడులో ఏడాదికే దెబ్బతిన్న సీసీ రోడ్డుపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.  నగర పంచాయతీలో జరిగిన అభివృద్ధి, నిధులు, ఖర్చుల వివరాలు చెప్పాలని కమిషనర్‌ను కోరితే వైసీపీ నాయకులు పక్కదారి పట్టించే మాటలు మాట్లాడడం సరికాదన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి, బత్తల హరికృష్ణ, వింజం రామానాయుడు, కోటి, ఉసురుపాటి ప్రసాద్‌, దొడ్ల కోదండ రామిరెడ్డి, కావలి వెంకటేశ్వర్లు, బాలాకుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-02T05:04:46+05:30 IST