పాలకులు తిరిగే ఈ రోడ్డులో ‘డేంజర్‌ జోన్‌’..!

ABN , First Publish Date - 2021-03-06T12:16:43+05:30 IST

ఈ రోడ్డులో శివనారాయణపురం వద్ద గల కల్వర్టు సైతం దాదాపుగా కొట్టుకుపోయింది.

పాలకులు తిరిగే ఈ రోడ్డులో ‘డేంజర్‌ జోన్‌’..!

  • బడంగ్‌పేట్‌-అల్మాస్‌గూడ రోడ్డులో వర్షాలకు కొట్టుకుపోయిన కల్వర్టు
  • ఆరు నెలలైనా బాగు చేయని అధికారులు

హైదరాబాద్/సరూర్‌నగర్‌ : ఆరు నెలల క్రితం కురిసిన భారీ వానలకు బడంగ్‌పేట్‌-అల్మా‌స్‌గూడ ప్రధాన రహదారి పలుచోట్ల కోతలకు గురైంది. ఈ రోడ్డులో శివనారాయణపురం వద్ద గల కల్వర్టు సైతం దాదాపుగా కొట్టుకుపోయింది. అప్పట్లో బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ అధికారులు తూతూ మంత్రంగా మట్టి పోసి చేతులు దులుపుకున్నారే తప్ప ఇప్పటి వరకు పూర్తి స్థాయి మరమ్మతులకు పూనుకోవడంలేదు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి పూట ద్విచక్ర వాహనాలు అదుపు తప్పి కల్వర్టులో పడిపోతున్నాయి కూడా!


సగం మంది పాలకులు తిరిగేది ఈ రోడ్డు మీదుగానే..

బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌కు చెందిన సగం మంది ప్రజా ప్రతినిధులు నిత్యం ఇదే రోడ్డులో తిరుగుతుంటారు. అల్మా్‌సగూడలోని ఏడుగురు కార్పొరేటర్లు, గుర్రంగూడకు చెందిన ఇద్దరు కార్పొరేటర్లు సహా మేయర్‌, డిప్యూటీ మేయర్‌, కమిషనర్‌, ఇంజనీరింగ్‌ విభాగం అధికారులు ఈ రోడ్డులోనే ప్రయాణిస్తుంటారు. ఇక మీర్‌పేట్‌లోని పోలీసు స్టేషన్‌కు సైతం ఈ రోడ్డు మీదుగానే వెళ్లక తప్పదు. దాంతో ఎప్పుడు చూసినా రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిలోని కల్వర్టు వద్ద ప్రమాదకర పరిస్థితి ఉన్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం అక్కడ హెచ్చరిక బోర్డులుగానీ, రేడియం రిబ్బన్లుగానీ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ దిశలోనూ చర్యలు చేపట్టకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2021-03-06T12:16:43+05:30 IST