దర్గా పీఠాధిపతి కన్నుమూత
ABN , First Publish Date - 2020-12-01T06:22:48+05:30 IST
ముస్లిం ప్రముఖుడు, తాహెరె గుల్షన్ దర్గా పీఠాధిపతి డాక్టర్ ఇస్మాయిల్ పీర్ ఖాద్రి(జాగీర్బాషా సాహెబ్) సోమవారం మృతిచెందారు.
కర్నూలు(న్యూసిటీ), నవంబరు 30: ముస్లిం ప్రముఖుడు, తాహెరె గుల్షన్ దర్గా పీఠాధిపతి డాక్టర్ ఇస్మాయిల్ పీర్ ఖాద్రి(జాగీర్బాషా సాహెబ్) సోమవారం మృతిచెందారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించినా ప్రయోజనం లేకపోవడంతో కర్నూలుకు తీసుకువచ్చారు. ఈయన గతంలో ప్రభుత్వ పీహెచ్సీలో యునాని వైద్యుడిగా సేవలు అందించారు. నగరంలోని చౌక్బజార్ దర్గా వద్ద జీబీ మసీదును నిర్మించారు. పేద పిల్ల లు అరబ్బీ చదువుకునేందుకు వీలుగా మసీదుకు అనుబంధంగా మదరసా స్థాపించారు. అందులో స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల వేడుకలను నిర్వహించేవారు. ఈయనకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు.
ఆయన లోటు తీరనిది..
ముస్లింలకు ఆయనలేని లోటు తీరనిదని మర్కజీ ఆంజుమనే అహ్లెసున్నతుల్ జమాత్ జిల్లా కార్యదర్శి షఫిపాషా ఖాద్రి తెలిపారు. ఆయన తన కార్యాలయంలో జమాత్ ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమై డాక్టర్ ఇస్మాయిల్పీర్ ఖాద్రి(జాగీర్భాషసాహెబ్) మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసారు.