దర్గా దగ్ధం నిందితుల్ని అరెస్టు చేయాలి

ABN , First Publish Date - 2021-01-18T07:59:11+05:30 IST

‘‘నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో రథాలకు నిప్పు పెట్టిన నిందితులపై చర్యలు తీసుకోవడంలో జగన్‌ సర్కారు విఫలమైంది.

దర్గా దగ్ధం నిందితుల్ని అరెస్టు చేయాలి

జగన్‌, మంత్రుల అండతోనే 

నేరగాళ్ల విశృంఖలత్వం: చంద్రబాబు


అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ‘‘నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో రథాలకు నిప్పు పెట్టిన నిందితులపై చర్యలు తీసుకోవడంలో జగన్‌ సర్కారు విఫలమైంది. ఇప్పుడు చిత్తూరు జిల్లా నాగిరెడ్డిపల్లెలో జిలానీ బాబా దర్గాను దగ్ధం చేయడం క్రిమినల్‌ గ్యాంగ్‌ల బరితెగింపునకు నిదర్శనం. 30ఏళ్లుగా ప్రతి ఏటా ఉరుసు ఉత్సవం ఘనంగా జరిపే దర్గాకు నిప్పు పెట్టడం కిరాతక చర్య. ముఖ్యమంత్రి జగన్‌, వైసీపీ మంత్రుల అండ చూసుకునే రాష్ట్రంలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘ఓ వైపు దేవాలయాలపై దాడులు, విధ్వంసకాండ. మరో వైపు దర్గాల దగ్ధం జరగడాన్ని బట్టి నేరగాళ్ల మూకలు ఎంత బరి తెగించాయో తెలుస్తోంది.


మొదటి ఘటన జరిగినప్పుడే నిందితులపై చర్య తీసుకుని ఉంటే ఈ ఉన్మాదం ఇంత పెట్రేగేది కాదు. పోలీసుల్లో కొందరు ఉదాసీనత, కుమ్మక్కు దుష్ఫలితమే ఈ విధ్వంసకాండకు కారణం’’ అని మండిపడ్డారు. జగన్‌రెడ్డి సీఎం అయ్యాక నేరగాళ్ల విశృంఖల విహారానికి అడ్డు, అదుపు లేకుండా పోయిందన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో ప్రారంభించినా... ఇతర ప్రతిపక్షాలపై, అన్ని వర్గాల ప్రజలపైౖ దాష్టీకం చేస్తున్నారన్నారు. శాంతిభద్రతలు పరిరక్షించి, ప్రజల మనోభావాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. జిలానీ బాబా దర్గాని దగ్ధం చేసిన నిందితులిన తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-01-18T07:59:11+05:30 IST