మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పించిన Subramanian Swamy
ABN , First Publish Date - 2021-11-25T15:31:47+05:30 IST
భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి గురువారం మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు...
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్యస్వామి గురువారం మోడీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు దాదాపు ప్రతీ అంశంలోనూ విఫలమైందని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని కలిసిన ఒకరోజు తర్వాత సుబ్రమణ్యస్వామి బీజేపీ సర్కారు వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు.ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు భద్రత రంగాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. అఫ్ఘానిస్థాన్ సంక్షోభంలో కేంద్రం వ్యవహరించిన తీరును ఆయన తప్పు బట్టారు. పెగాసస్ డేటా భద్రతా ఉల్లంఘనకు సుబ్రమణ్యస్వామి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, రాజీవ్ గాంధీ, చంద్రశేఖర్, పివి నరసింహారావు వంటి రాజకీయ ప్రముఖులతో సుబ్రమణ్యస్వామి పోల్చారు.‘‘మన అణ్వాయుధానికి చైనా భయపడకపోతే, వారి అణ్వాయుధానికి మనం ఎందుకు భయపడుతున్నాం?’’ అని ట్వీట్ చేశారు.