గల్లంతైన యువకుల మృతదేహాలు వెలికితీత

ABN , First Publish Date - 2020-12-01T06:29:24+05:30 IST

నాలుగు రోజుల క్రితం పెదపవని సమీపంలోని ఉప్పుటేరులో ఆటో బోల్తాపడి గల్లంతైన యువకుల మృతదేహాలను ఎట్టకేలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెలికితీశారు.

గల్లంతైన యువకుల మృతదేహాలు వెలికితీత
మృతదేహాలను ఒడ్డుకు తెస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

పోస్ట్‌మార్టంకు తరలింపు 

పెదపవని (లింగసముద్రం) నవంబరు 30 : నాలుగు రోజుల క్రితం పెదపవని సమీపంలోని ఉప్పుటేరులో ఆటో బోల్తాపడి గల్లంతైన యువకుల మృతదేహాలను ఎట్టకేలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెలికితీశారు. మంగళగిరి నుంచి వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సీఐ ఎస్వీ రమణ పర్యవేక్షణలో సిబ్బంది సోమవారం ఉప్పుటేరులో గాలించారు. ఆటో పడ్డ చోటు నుంచి పర్లాంగు దూరంలో ఉదయం 9గంటల సమయంలో ఒకరి మృతదేహం, మధ్యాహ్నం 12 గంటల సమయంలో మరొకరి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాలు బ్రిడ్జి సమీపంలో చిల్లచెట్లలో ఉండగా పడవల ద్వారా ఒడ్డుకు చేర్చారు. అవి ఉబ్బి, కుళ్లి దుర్వాసన వస్తున్నాయి. తహసీల్దార్‌ బ్రహ్మయ్య, కందుకూరు సీఐ విజయకుమార్‌, గుడ్లూరు ఎస్‌ఐ మల్లికార్జునరావు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 

Updated Date - 2020-12-01T06:29:24+05:30 IST