చెవికెక్కని దైన్యం!

ABN , First Publish Date - 2021-06-19T08:59:17+05:30 IST

నకిలీ పింఛన్‌ దారులపై చర్యలు తీసుకుంటున్న అధికారుల అత్యుత్సాహం.. పుట్టుకతోనే బధిరుడైన ఓ వ్యక్తి పొట్ట కొట్టింది.

చెవికెక్కని దైన్యం!

  • పుట్టుకతో బధిరుడైన వ్యక్తికి పింఛన్‌ నిలిపివేత
  • నకిలీ పింఛనంటూ అధికారుల అత్యుత్సాహం

మంచిర్యాల, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): నకిలీ పింఛన్‌ దారులపై చర్యలు తీసుకుంటున్న అధికారుల అత్యుత్సాహం.. పుట్టుకతోనే బధిరుడైన ఓ వ్యక్తి పొట్ట కొట్టింది.  ఆయనకు నెలనెలా వస్తున్న ఆసరా పింఛన్‌ను అధికారులు ఆపేశారు. పైగా ఇప్పటిదాకా తీసుకున్న పింఛన్‌ డబ్బును వెనక్కిచ్చేయాలంటూ నోటీసు కూడా జారీ చేశారు. దీంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట, కొర్విచెల్మ గ్రామాల్లో ఆసరా పింఛన్లలో అవకతవకలు జరిగాయి. దీనిపై ‘పింఛన్‌ ఫ్యామిలీ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ జనవరి 4న వెలుగులోకి తెచ్చింది. విచారణ జరిపిన అధికారులు వినికిడి లోపంతో సదరమ్‌ సర్టిఫికెట్‌ కలిగిన వారికి హైదరాబాద్‌లో నిర్ధారణ పరీక్షలకు హాజరుకావాలని ఆదేశించారు. 


పరీక్షకు హాజరుకాని వారి పింఛన్లను నిలిపివేస్తూ, ఇప్పటి దాకా తీసుకున్న పింఛన్‌ డబ్బులు వాపస్‌ చేయాలని నోటీసులు జారీ చేశారు. అయితే మండలంలోని కొర్విచెల్మ గ్రామానికి చెందిన మోటపల్కుల ప్రశాంత్‌కు పుట్టుకతో మూగ, చెవుడు ఉంది. ఆయనకు నూరు శాతం అంగవైకల్యం ఉన్నట్లు భారత ప్రభుత్వం 22-05-2019న పర్మనెంట్‌ యూనిక్‌ డిజేబిలిటీ ఐడీ కూడా జారీ చేసింది. ఆ ధ్రువీకరణ పత్రాలతోనే ఆయన ప్రభుత్వం నుంచి ప్రతి నెలా రూ.3,016 పింఛన్‌ పొందుతున్నాడు. అధికారుల అనాలోచిత చర్యల వల్ల ఉన్న పింఛను రద్దు కావడమేగాక ఇంతకాలం తీసుకున్న సొమ్ము కూడా చెల్లించాలనడంతో అయోమయానికి గురవుతున్నాడు. ఆసరా పింఛన్‌లలో జరిగిన అవకతవకలలో బాధ్యులపై చర్యలు చేపట్టవలసిన అధికారులు అన్ని అర్హతలున్న వారి పింఛన్‌లను నిలిపివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రిని సంప్రదించగా నిర్ధారణ పరీక్షకు హాజరుకానందునే ప్రశాంత్‌కు పింఛన్‌ నిలిపివేసినట్లు తెలిపారు.

Updated Date - 2021-06-19T08:59:17+05:30 IST