అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ABN , First Publish Date - 2021-06-04T05:24:02+05:30 IST

అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండల మండలంలో వివాదాస్పదమైంది.

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ప్రేమ వ్యవహరమే కారణమని మృతుడి తండ్రి అరోపణ

యువతి ఇంట్లో మృతదేహం ఉంచి ఆందోళన 

చంద్రుగొండ, జూన్‌ 3: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండల మండలంలో వివాదాస్పదమైంది. చంద్రుగొండ మండలం వెంకట్యాతండా పంచాయతీ పరిధిలో కర్శలబోడు గ్రామానికి చెందిన బోడా వినోద్‌కుమార్‌(23) ఇదే గ్రామానికి చెందిన యువతి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో కలహాలకు కారణమైంది. దాంతో పలుమార్లు గ్రామంలో పంచాయతీలు, గొడవలు జరిగాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటికి వెళ్లిన వినోద్‌కుమార్‌ అనుమానాస్పదస్థితిలో గ్రామం పక్కన గల పంట పొలాల్లో చనిపోయాడు. దీంతో ఆగ్రహించిన అతడి కుటుంబ సభ్యులు వినోద్‌కుమార్‌ మృతదేహాన్ని తీసుకొచ్చి ప్రేమించిన యువతి ఇంట్లో ఉంచి ఆందోళన చేశారు. తన కుమారుడి మృతికి యువతి కుటుంబ సభ్యులే కారణమని, తన కుమారుడిని రాత్రి వేళల్లో కొట్టి చంపారని అతడి తండ్రి బోడా సక్రాం ఆరోపించాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల సభ్యులు ఘర్షణ పడ్డారు. దాంతో పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న జూలూరుపాడు సీఐ నాగరాజు గ్రామాన్ని సందర్శించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన కుమారుడి మృతికి ప్రేమ వ్యవహరమే కారణమని మృతుడి తండ్రి సక్రాం చంద్రుగొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజేష్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-04T05:24:02+05:30 IST