ఎన్నెస్పీ కాల్వలో పడి యువకుడి మృతి

ABN , First Publish Date - 2021-01-07T04:59:24+05:30 IST

ప్రమాదవశాత్తూ ఎన్నెస్పీ కాల్వలో పడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన పెనుబల్లి మండలం సూరయ్యబంజర్‌ వద్ద బుధవారం చోటుచేసుకుంది.

ఎన్నెస్పీ కాల్వలో పడి యువకుడి మృతి
మృతదేహాన్ని వెలికితీస్తున్న పోలీసులు, గ్రామస్థులు

పెనుబల్లి, జనవరి 6: ప్రమాదవశాత్తూ ఎన్నెస్పీ కాల్వలో పడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన పెనుబల్లి మండలం సూరయ్యబంజర్‌ వద్ద బుధవారం చోటుచేసుకుంది. కోండ్రుపాడు గ్రామానికి చెందిన చౌడబోయిన శివ(34)బుధవారం ఉదయం ఎన్నెస్పీ కాల్వ వద్ద పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి రూరల్‌ సీఐ  కరుణాకర్‌ సిబ్బందితో సంఘటనాస్థలానికి చేరుకొని గ్రామస్థుల సహకారంతో రెండుగంటలు గాలింపు చర్యలు చేపట్టి చివరకు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించి కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతుడి తండ్రి కోండ్రుపాడు గ్రామ వీఆర్‌ఏ కావడంతో కోండ్రుపాడు, సూరయ్యబంజర్‌, లంకాసాగర్‌ గ్రామాల ప్రజలు ఘటనాస్థలానికి భారీగా చేరుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, సొసైటీ అధ్యక్షుడు చింతనిప్పు సత్యనారాయణ, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మందడపు అశోక్‌కుమార్‌, బెల్లంకొండ చలపతిరావు, వెంకటేశ్వరరావు, లక్కినేని వినీల్‌, కనగాల వెంకట్రావ్‌ ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-01-07T04:59:24+05:30 IST