తండ్రి కళ్లెదుటే కుమారుడి దుర్మరణం
ABN , First Publish Date - 2021-10-09T04:54:38+05:30 IST
పిల్లలను కళాశాలలో దించేందుకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే కుమారుడు దుర్మరణం పాలైన విషాద సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలో జరిగింది.
కొడుకు, కూతురిని కళాశాలలో దించేందుకు వెళుతుండగా ఢీకొట్టిన లారీ
ఖమ్మం జిల్లా రూరల్మండలం కరుణగిరి వద్ద సంఘటన
ఖమ్మంరూరల్, అక్టోబరు 8: పిల్లలను కళాశాలలో దించేందుకు వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కళ్లెదుటే కుమారుడు దుర్మరణం పాలైన విషాద సంఘటన శుక్రవారం ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలో జరిగింది. పోలీసుల కధనం ప్రకారం ఖమ్మంజిల్లా ఖమ్మంరూరల్ మండలం సత్యనారాయణపురం సమీపంలోని సాయినగర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎనగందుల దేవయ్యకు కుమారుడు ఠాగూర్(17), కూతురు పవిత్ర ఉన్నారు. ఠాగూర్ ఇంటర్ సెంకండ్ ఇయర్, పవిత్ర ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. దేవయ్య తన కుమారుడిని, కూతురుని శుక్రవారం ఉదయం ఖమ్మంలోని కళాశాలలో దించేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఈ క్రమంలో వారు కరుణగిరి సమీపంలోకి వచ్చిన సమయంలో.. వెనుకనుంచి అతివేగంగా వచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఠాగూర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, దేవయ్య, పవిత్ర తీవ్రగాయాలవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవయ్య భార్య విజయకుమారి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికందిన కొడుకు ఠాగూర్ మృతదేహాన్ని, తీవ్రగాయలతో పడిఉన్న దేవయ్యను, కూతరు పవిత్రను చూసి విజయకుమారి గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ సంఘటనతో సాయినగర్లో విషాదం అలముకుంది.