కాసేపట్లో ఇంట్లో ఉంటా.. అంటూ ఫోన్లో భార్యకు చెప్పిన భర్త.. వర్షం వస్తోందని బస్టాప్లో ఆగడమే అతడి పొరపాటయింది..!
ABN , First Publish Date - 2021-09-07T01:01:04+05:30 IST
అంతకుమునుపే అతడికి ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇంకా లేటవుతుందా అని భార్య అడగ్గా మరో పది నిమిషాల్లో ఇంటి ముందు ఉంటానని అతడు జావాబిచ్చాడు. అలా అన్నాడో లేదో..
ఇంటర్నెట్ డెస్క్: అంతకుమునుపే అతడికి ఇంటి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఇంకా లేటవుతుందా అని భార్య అడగ్గా మరో పది నిమిషాల్లో ఇంటి ముందు ఉంటానని అతడు జవాబిచ్చాడు. అలా అన్నాడో లేదో..వెంటనే పెద్ద పెట్టున వర్షం మొదలైంది. దీంతో..అతడు సైకిల్ను ఓ బస్టాప్ వద్ద ఆపి.. నిలబడ్డాడు. అప్పటికే బాగా పొద్దుపోయింది. మరోవైపు.. భర్త ఇంటికి ఎప్పుడు వస్తాడా అని అతడి కోసం భార్య ఎదురు చూస్తోంది. ఇంతలో పోలీసులు ఆమె ఇంటి తలుపు తట్టారు. ‘కరెంట్ షాక్ తగిలి మీ భర్త మృతి చెందాడంటూ’ వారు చెప్పడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో ఇటీవల ఈ దారుణం చోటుచేసుకుంది.
బస్టాప్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్లో షార్ట్ సర్క్యూట్ అవడంతో..ఆ స్తంభంపై చేయి వేసిన అజయ్ విద్యుదాఘాతానికి గురయ్యాడని స్థానిక పోలీసులు తెలిపారు. అజయ్ అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అజయ్ మృతి చెందాడు.
పురపాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగానే ఈ మరణం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనేక బస్టాప్లలో ఇలా విద్యుత్ హోర్డింగ్లు ఏర్పాటు చేశారని వారు చెబుతున్నారు. వీటి ఏర్పాటు వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయో అంచనా వేసేందుకు అధికారులు ఎటువంటి ముందస్తు అధ్యయనాలూ నిర్వహించలేదని వారు ఆరోపిస్తున్నారు.