డెత్ సెంటర్
ABN , First Publish Date - 2021-04-16T05:33:36+05:30 IST
నెల్లూరు నగర పరిధిలో ఎన్టీఆర్ సమీపంలోని హైవే కూడలి మృత్యు కుహరంగా మారుతోంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై కావలి వైపు వెళ్లే మార్గంలో పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదాల శాతం, వాటిలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.
ప్రమాదకరంగా హైవే కూడలి
నెల్లూరు(స్టోన్హౌస్పేట), ఏప్రిల్ 15:
నెల్లూరు నగర పరిధిలో ఎన్టీఆర్ సమీపంలోని హైవే కూడలి మృత్యు కుహరంగా మారుతోంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై కావలి వైపు వెళ్లే మార్గంలో పెట్రోల్ బంక్ వద్ద ప్రమాదాల శాతం, వాటిలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో ఎంతో మంది ఆ ప్రాంతంలో మృత్యువాత పడ్డారు. అయినా పోలీసులు, అధికారులు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నవాబుపేట నుంచి నరూకూరు వైపు వెళ్లే దారిలో రోడ్డు మరమ్మతు పనులు జరుగుతుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో వాహనదారులు కసుమ హరిజనవాడ వద్ద పెట్రోల్ బంకు దాటిన తర్వాత కుడిచేతి వైపు తిరిగే మార్గం గుండా జాతీయ రహదారి మీదుగా ప్రయాణిస్తున్నారు. నిత్యం వేలాది వాహనాలు ఆ మార్గాన రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో రోజూ ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ అంతరాయం తీవ్రంగా ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో వాహనదారులు దుర్మరణం చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇద్దరు పోలీసులను ఆ కూడలిలో నియమించి ట్రాఫిక్ను, ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.