బ్రిటన్లో 40వేలు దాటిన కోవిడ్ మరణాలు..!
ABN , First Publish Date - 2020-06-06T19:34:55+05:30 IST
బ్రిటన్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది.
లండన్: బ్రిటన్లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీంతో ఆ దేశంలో కోవిడ్ మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే 357 మంది ఈ వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోగా.. దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 40,261కు చేరుకున్నట్లు యూకే ఆరోగ్యశాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ తెలిపారు. దీంతో యూరోప్లో అత్యధిక కరోనా మరణాలు సంభవించిన దేశంగా బ్రిటన్ నిలిచింది. అలాగే బ్రిటన్ వ్యాప్తంగా కరోనా బారిన పడ్డ వారు 2,83,311 మంది అయ్యారు.
మరోవైపు యూకే కోవిడ్ చికిత్సకు ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధానికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా బాధితులపై అది ఎలాంటి ప్రభావం చూపించలేకపోయిందని సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం 1542 మంది కోవిడ్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇవ్వగా వారిలో ఎలాంటి మార్పురాలేదని తెలిపింది. మరణ ప్రమాదాన్ని తగ్గించలేకపోయిందని బ్రిటన్ ఆరోపించింది. ఇదిలా ఉంటే... ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి ఇప్పటికే 3.98 లక్షల మందిని కబళించింది. 68 లక్షలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు.