‘సుప్రీంకోర్టు వికేంద్రీకరణ మెసేజ్ బూటకం’
ABN , First Publish Date - 2021-08-11T20:47:18+05:30 IST
సుప్రీంకోర్టును వికేంద్రీకరించి చెన్నై, ముంబై, కోల్కతాలలో ధర్మాసనాలను
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టును వికేంద్రీకరించి చెన్నై, ముంబై, కోల్కతాలలో ధర్మాసనాలను ఏర్పాటు చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని వెల్లడైంది. ఈ సందేశం వాట్సాప్ ద్వారా విపరీతంగా ప్రచారమవుతోందని, ఇది పూర్తిగా తప్పు అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) తెలిపింది. ఈ విషయాన్ని పీఐబీ ట్విటర్ హ్యాండిల్ ద్వారా తెలిపింది.
‘‘ఇకపై సుప్రీంకోర్టు చెన్నై, ముంబై, కోల్కతాలకు రాబోతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సుప్రీంకోర్టు శాఖలను మూడు చోట్ల ఏర్పాటు చేయబోతున్నారు. చెన్నై, ముంబై, కోల్కతాలలో సుప్రీంకోర్టు శాఖలను ఏర్పాటు చేయబోతున్నారు’’ అనే మెసేజ్ వాట్సాప్లో వైరల్ అవుతోంది.
ఇది బూటకపు మెసేజ్ అని, ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా స్పష్టమైందని పీఐబీ తెలిపింది.