జీవో 3పై సుప్రీంలో రివ్యూ పిటీషన్ వేద్దాం.. సీఎంను కలిసి అభ్యరిద్దాం
ABN , First Publish Date - 2020-06-29T17:29:11+05:30 IST
ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన జీవో నెం.3ని పునరుద్దరించేందుకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును కలిసి అభ్యర్థించాలని
జాతీయ ఆదివాసీ అఖిలపక్ష సంఘాల ఐక్యవేదిక నిర్ణయం
భద్రాచలం (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించిన జీవో నెం.3ని పునరుద్దరించేందుకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును కలిసి అభ్యర్థించాలని జాతీయ ఆదివాసీ అఖిలపక్ష సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. భద్రాచలంలో ఆదివారం జాతీయ గిరిజన విధానంపై జాతీయ ఆదివాసీ అఖిలపక్ష సంఘాల ఐక్యవేదిక సమావేశమైంది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే, జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ చందా లింగయ్య దొర అధ్యక్షత వహించారు. సమావేశంలో జీవో నెం.3పై సీఎంను ఐక్యవేదికలోని నాయకులందరు కలిసి సుప్రీంకోర్టులో వెంటనే రివ్యూ పిటీషన్వేసేందుకు అభ్యర్థించాలన్నారు. అలాగే పోడు భూముల నుంచి ఆదివాసీలను తొలగించకుండా వారికి పట్టాలందించేందుకకు న్యాయ పోరాటం ప్రభుత్వాలకు వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయించారు.
ఏజెన్సీలో గిరిజనేతరులకు మంజూరు చేసిన బైనామా పట్టాలను వెంటనే రద్దు చేయాలని పెసా చట్టంకు అనుగుణంగా కేంద్ర చట్టాన్ని సవరణ చేయాలని నిర్ణయించారు. పోలవరం పాజ్రెక్టు బాధితులకు న్యాయమైన పరిహారం పునారవాసం కల్పించాలని నిర్ణయించారు. ఈ అంశాలను సాధించడం కోసం జాతీయస్థాయిలో ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఇందు కోసం జాతీయ ఆదివాసీ అఖిలపక్ష సంఘాల ఐక్యవేదిక జాతీయ చైర్మన్గా చందా లింగయ్యదొర ను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అలాగే కమిటీ సభ్యులుగా ఏపీ నుంచి సున్నం వెంకటరమణ, శ్రీనివాస్, కుర్సం రామారావుదొర, దమయంతి, దమయంతి నాయుడు, సుబ్బారావుదొరలను ఎన్నుకోగా తెలంగాణ నుంచి కొప్పా వీరయ్య, లక్ష్మణరావు, దాట్ల నాగేశ్వరరావు, శ్రీనాద్, వెంకటరమణ, సిడెం అర్జు, డా. తెల్లం వెంకట్రావు, చిచ్చడి శ్రీరామమూర్తి, సమ్మయ్యలను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో చందాలింగయ్యతో పాటు జిల్లాపరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, మెచ్చానాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, తాటి వెంకటేశ్వర్లు, ఆదివాసీ సంఘాల నాయకులు కెచ్చెల రంగారెడ్డి, కణితి జయబాబు పాల్గొన్నారు.