హత్య కేసులో నిందితుల రిమాండ్
ABN , First Publish Date - 2021-10-24T06:36:56+05:30 IST
వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్నగర్లో ఈ నెల 19న జరిగిన పిట్టల మహేశ్(29) అనే యువకుడి హత్య కేసులో నిందితులను రిమాండ్ చేశామని, పథకం ప్రకారమే హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు.
- వివరాలు వెల్లడించిన ఎస్పీ
సిరిసిల్ల క్రైం, అక్టోబరు 23: వేములవాడ రూరల్ మండలంలోని ఫాజుల్నగర్లో ఈ నెల 19న జరిగిన పిట్టల మహేశ్(29) అనే యువకుడి హత్య కేసులో నిందితులను రిమాండ్ చేశామని, పథకం ప్రకారమే హత్య చేసినట్లు విచారణలో వెల్లడైందని ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం వివరాలు వెల్లడించారు. ఫాజుల్నగర్కు చెందిన అన్నదమ్ములు పిట్టల రాజేశం, పిట్టల లక్ష్మీనర్సయ్య మధ్య కొంతకాలంగా 5 ఎకరాల భూమి విషయంలో తగాదా నెలకొంది. ఈ నెల 19న పొలం వద్దకు వెళ్లి వస్తున్న పిట్టల రాజేశంను పిట్టల లక్ష్మీనర్సయ్య, పిట్టల పర్శరాములు, పిట్టల మొండవ్వ రోడ్డుపై ఆపారు. గొడవ పడి దాడికి దిగారు. తన తండ్రిని కొడుతున్నట్లు తెలుసుకున్న పిట్టల రాజేశం కుమారుడు మహేశ్ అక్కడికి చేరుకున్నాడు. తండ్రి రాజేశంను కాపాడేందుకు ప్రయత్నించాడు. పథకం ప్రకారం ఆరునెలల క్రితం నాందేడ్ వెళ్లి మూడు కత్తులు కొనుగోలు చేసిన ప్రత్యర్థులు తండ్రీకొడుకులపై విచక్షణ రహితంగా కత్తులతో డాడి చేశారు. మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. తండ్రి రాజేశం తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం నిందితులు పరారయ్యాయరు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు రాజేశంను హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. శనివారం ఫాజుల్ నగర్లోని ఎల్లమ్మగుడి వద్ద పిట్టల లక్ష్మీనర్సయ్య, పిట్టల పర్శరాములు, పిట్టల మొండవ్వను అరెస్టు చేశామని, వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, ఇతర సామగ్రిని స్వాఽధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిందితులపై హత్యనేరంతోపాటు కుట్ర, ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసినట్లు, కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. సమావేశంలో డీఎస్పీ చంద్రకాంత్, సీఐ బన్సీలాల్, ఎస్సై మాలకొండరాయుడు ఉన్నారు.