వృద్ధులకు అయోధ్య రాముని ఉచిత దర్శనం : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-03-10T23:49:13+05:30 IST

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని వృద్ధులకు గ్రాండ్

వృద్ధులకు అయోధ్య రాముని ఉచిత దర్శనం : కేజ్రీవాల్

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలోని వృద్ధులకు గ్రాండ్ ఆఫర్ ప్రకటించారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తయితే, శ్రీరాముని దర్శనానికి ఉచితంగా పంపిస్తామని తెలిపారు. తాను హనుమంతుడి భక్తుడినని తెలిపారు. రామరాజ్యం గురించి వివరించారు. 


ఢిల్లీ శాసన సభ సమావేశంలో బుధవారం కేజ్రీవాల్ మాట్లాడుతూ, తాను హనుమంతుడి భక్తుడినని చెప్పారు. హనుమంతుడు శ్రీరాముని భక్తుడని, ఆ విధంగా తాను అటు ఆంజనేయునికి, ఇటు శ్రీరామునికి భక్తుడినేనని తెలిపారు. శ్రీరాముడు అయోధ్యకు రాజు అని, ఆయన పరిపాలనలో అన్ని విషయాలూ మంచిగానే ఉండేవని చెప్తూ ఉంటారన్నారు. ఆయన పరిపాలనలో ప్రజలకు ఎటువంటి విచారం ఉండేది కాదన్నారు. ప్రజలందరికీ అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేవని తెలిపారు. అందుకే దానిని రామరాజ్యం అని చెబుతారని పేర్కొన్నారు. ఢిల్లీలోని వయో వృద్ధులు అయోధ్య రామాలయానికి వెళ్ళడానికి ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. 


ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణం పూర్తికావడానికి సుమారు మూడేళ్ళు పట్టవచ్చు. రామాలయం నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. శ్రీరాముని ఆశీస్సులు మనందరిపైనా ఉంటాయని చెప్పారు. 


Updated Date - 2021-03-10T23:49:13+05:30 IST