ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు
ABN , First Publish Date - 2021-07-22T17:08:56+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు ఆందోళన చేపట్టనున్న నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పార్లమెంట్కు వెళ్లే అన్ని దారులను పోలీసులు మూసివేశారు. పార్లమెంట్ చుట్టుపక్కల ఉన్న అన్ని మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 9 నెలల నుండి రైతుల ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. సింగు బార్డర్ నుండి బస్సులో రైతులు జంతర్ మంతర్ వద్దకు చేరుకోనున్నారు.
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్లో రైతులు నిరసన తెలుపనున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీకి చెందిన 200 మంది గుర్తింపు కార్డులు కలిగిన రైతులకు మాత్రమే ధర్నా చేయటానికి అనుమతినిచ్చారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జంతర్ మంతర్ సమీపంలోని పార్లమెంట్ స్ట్రీట్ రోడ్డులో ధర్నాకు అనుమతి ఇచ్చారు. జూలై 22 నుండి ఆగష్టు 9 వరకు శాంతియుత పద్ధతులలో కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ధర్నా చేయడానికి అనుమతి ఉంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు రైతుల నుండి రాతపూర్వక హామీ తీసుకున్నారు. జనవరి 26 ఘటన మరోసారి పునరావృతం కాకుండా ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశరాజధానితో అనుసంధానించబడ్డ జాతీయ రహదారులపై నిరంతర నిఘా విధించారు.