కొవిడ్తో ప్రాణాలు పోతున్నాయ్!
ABN , First Publish Date - 2021-04-21T07:31:48+05:30 IST
కరోనా విజృంభించిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులు, అవసరాన్ని బట్టి టీకాలు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లూ, మందులు, వనరులను అందించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది...
- కేంద్రం సత్వర నిర్ణయాలు తీసుకోవాలి
- పరిశ్రమలకు ఆక్సిజన్ ఆపి ఆస్పత్రులకు ఇవ్వాలి
- కేంద్రాన్ని తప్పుబట్టిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా విజృంభించిన నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితులు, అవసరాన్ని బట్టి టీకాలు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లూ, మందులు, వనరులను అందించాలని ఢిల్లీ హైకోర్టు మంగళవారం కేంద్రాన్ని ఆదేశించింది. లేకపోతే వైర్సతో భారీగా మరణాలకు కారకులవుతుందని హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రాల అవసరాలకు తగ్గట్టుగా ప్రాణరక్షక మందులు, వ్యాక్సిన్, వనరుల తరలింపులో ఆలోచించి సత్వర నిర్ణయాలు తీసుకోనట్లయితే మహమ్మారి కారణంగా ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెట్రోలియం, ఉక్కు తదితర పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరాను తగ్గించి కొవిడ్ రోగుల కోసం మళ్లించాల్సిందిగా ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. ‘‘పరిశ్రమలకు ఆక్సిజన్ సరఫరా ఆపినా ఏమీ కాదు. ప్రాణవాయువు అందకపోతే రోగులు బతకరు. దేశం జనాభా 130 కోట్లలో అధికారికంగా సుమారు రెండు కోట్ల దాకా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకవేళ కొవిడ్ కేసుల సంఖ్య పదికోట్లకు పెరిగినా....మిగతా జనాభాను మనం కాపాడుకోవాలిగా. ఈ లెక్కన కొవిడ్కు కోటి మందిదాకా బలైపోతారు. ఇప్పటికైనా మనం వేగంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవాలి. పాలించడం ముఖ్యం కాదు, పరిస్థితి తీవ్రతబట్టి నిర్ణయాలు తీసుకోవాలి’’అని ధర్మాసనం కేంద్రానికి హితవు చెప్పింది.
వైద్య వ్యవస్థ కుప్పకూలే స్థితి..
రెమ్డెసివిర్ వినియోగంపై డాక్టర్లలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఏఎస్జీ చేతన్ శర్మ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది మోనికా అరోడా ధర్మాసనానికి నివేదించారు. కొవిడ్ రోగులకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నా బహిరంగ మార్కెట్లో అవి లభించడం లేదని ఢిల్లీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రాహుల్ మెహ్రా కోర్టుకు చెప్పారు. ఈ ఇంజెక్షన్లకు మార్కెట్లో కొరత ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇంజెక్షన్ల తయారీకి ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇచ్చినా సత్వర ఫలితాలు రావని, ప్లాంట్లు నెలకొల్పేందుకు సమయం పడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెకండ్ వేవ్ తీవ్రత చూస్తే దేశంలో వైద్యపరమైన మౌలిక వసతులు కుప్పకూలే స్థితి కనిపిస్తోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వ్యాక్సిన్ వృథా కావడంపై కూడా ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది నేరపూరిత వృథాగా పేర్కొంది.
ఇక కొవిడ్ రోగులకు ఆస్పత్రులలో తగిన పడకలు ఉన్నాయంటూ గుజరాత్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. పడకలు అందుబాటులో ఉంటే ఆస్పత్రులు రోగులను ఎందుకు చేర్చుకోవడం లేదని అడిగింది. కాగా, కొవిడ్ను నియంత్రించేందుకు గుజరాత్ ప్రభుత్వం రెండు వారాలు లాక్డౌన్ విధించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ హైకోర్టుకు సూచించింది.