ఔషధాలతో నేతలకేం పని?: ఢిల్లీ హైకోర్టు
ABN , First Publish Date - 2021-05-18T07:32:29+05:30 IST
అసలే కొవిడ్-19 మందులకు కొరత ఏర్పడిందని.. ఈ దశలో కొందరు రాజకీయ నాయకులు వాటిని ఎలా నిల్వ చేస్తారని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అసలీ వ్యవహారంతో వారికేం పని అని నిలదీసింది
న్యూఢిల్లీ, మే 17: అసలే కొవిడ్-19 మందులకు కొరత ఏర్పడిందని.. ఈ దశలో కొందరు రాజకీయ నాయకులు వాటిని ఎలా నిల్వ చేస్తారని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అసలీ వ్యవహారంతో వారికేం పని అని నిలదీసింది. వెంటనే మందులను అధికారులకు అప్పగించాలని స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, ఢిల్లీ కాంగ్రెస్ విభాగం అధ్యక్షుడు చౌధరి అనిల్కుమార్, అఖిల భారత యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ముకేశ్ శర్మ, బీజేపీ అధికార ప్రతినిధి హరీశ్ ఖురానా, ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే తదితరులు కరోనా చికిత్సకు ఉపకరించే మందులను సేకరించి.. పేదలకు వైద్య సాయం చేస్తున్నారు. వీరు కొవిడ్ మందులను నిల్వచేయడం చట్టవిరుద్ధమంటూ హృదయ ఫౌండేషన్ అధ్యక్షుడు, జాతీయ షూటింగ్ క్రీడాకారుడు దీపక్సింగ్ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.