వ్యాక్సిన్లు లేకుండా కాలర్ ట్యూన్ ఎందుకు?
ABN , First Publish Date - 2021-05-14T08:08:24+05:30 IST
ఒకవైపు వ్యాక్సిన్ల కొరత ఉంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలంటూ సెల్ఫోన్లలో కాలర్ ట్యూన్ల ద్వారా....
కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, మే 13: ఒకవైపు వ్యాక్సిన్ల కొరత ఉంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ప్రజలందరూ తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలంటూ సెల్ఫోన్లలో కాలర్ ట్యూన్ల ద్వారా ప్రచారం చేయడాన్ని ఢిల్లీ హైకోర్టు తప్పుబట్టింది. అసలు వ్యాక్సిన్లే లేకుండా ఎంతకాలం దాన్ని ప్రచారం చేస్తారని ప్రశ్నించింది. చిరాకు కలిగించే ఆ ట్యూన్ను ఎప్పటినుంచో వినిపిస్తున్నారని, వ్యాక్సిన్లు లేకుండా అలా ప్రచారం చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. అవసరమైతే డబ్బులు తీసుకొనైనా అందరికీ వ్యాక్సినేషన్ వేయాలని పిల్లలు కూడా చెబుతున్నారని పేర్కొంది. ఇలాంటి ప్రచారాల విషయంలో ప్రభుత్వం కొత్తగా ఏమైనా ఆలోచించాలని కోరింది. ఒకే మెసేజ్ను మళ్లీమళ్లీ వినిపించే కంటే వివిధ రకాల ట్యూన్లు తయారుచేయవచ్చని సూచించింది.