indian occupation అన్నందుకు..JNU వెబినార్పై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-10-31T20:52:04+05:30 IST
''ఇండియన్ ఆక్యుపేషన్ ఇన్ కశ్మీర్'' అనే పదజాలాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారనే ఆరోపణపై జేఎన్యూ వెబినార్ నిర్వాహకులపై..
న్యూఢిల్లీ: ''ఇండియన్ ఆక్యుపేషన్ ఇన్ కశ్మీర్'' అనే పదజాలాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగించారనే ఆరోపణపై జేఎన్యూ వెబినార్ నిర్వాహకులపై స్థానిక లాయర్ ఒకరు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కశ్మీర్ను భారత ఆక్రమిత కశ్మీర్గా పేర్కొనడం వెనుక కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ఆలోచన ఉందని ఢిల్లీ లాయర్ వినీత్ జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై సెంటర్ ఫర్ ఉమన్ స్టడీస్-జేఎన్యూ, వెబినార్ నిర్వాహకులపై ఆయన ఫిర్యాదు చేశారు. ''జెండర్ రెసిస్టెన్స్ అండ్ ఫ్రెష్ చాలెంజెస్ ఇన్ పోస్ట్ 2019 కశ్మీర్'' పేరుతో ఏర్పాటు చేసిన వెబినార్పై అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తం కావడంతో ఆ వెబినార్ రద్దయిందని, దేశ సమగ్రత విషయంలో దుష్ప్రచారానికి పాల్పడాలనే ఎజెండా ఒకటి దీని వెనుక ఉందనే విషయం స్పష్టమవుతోందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
భారత ప్రభుత్వం బలవంతంగానే కశ్మీర్ను ఆక్రమించుకుందనే అభిప్రాయం కలిగించడానికి నిర్వాహకులు ప్రయత్నించారని, తమ ఆలోచనకు ప్రచారం కలిగించి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ఆలోచన దీని వెనుక ఉందని పిటిషనర్ ఆరోపించారు. దేశంలో ఇతర ప్రాంతాల మాదిరిగానే కశ్మీర్ అంతర్భాగమని ఫిర్యాదుదారు పేర్కొంటూ, ఆక్రమిత కశ్మీర్ అని పేర్కొడం దేశవ్యతిరేక చర్య అని, ఇది పారులను రెచ్చగడమే కాకుండా, మతాల మధ్య చిచ్చుపెట్టే చర్య అవుతుందని అన్నారు.