కాబోయే భార్యతో వ్యాపారవేత్త అఫైర్.. ఢిల్లీలో చంపేసి గుజరాత్లో పడేసిన నిందితుడు!
ABN , First Publish Date - 2020-11-20T00:49:40+05:30 IST
మహిళా ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యాపారవేత్తను, ఆమెకు కాబోయే భర్త అత్యంత దారుణంగా చంపేసి సూట్కేసులో కుక్కి వేరే..
న్యూఢిల్లీ: మహిళా ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యాపారవేత్తను, ఆమెకు కాబోయే భర్త అత్యంత దారుణంగా చంపేసి సూట్కేసులో కుక్కి వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి పడేశాడు. ఢిల్లీలో జరిగిందీ ఘటన. ఈ నెల 13న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. వ్యాపారవేత్త నీరజ్ గుప్తా (46)కు ఫైసల్ (29)తో చాలాకాలంగా వివాహేర సంబంధం ఉంది. అయితే, ఆమె జుబేర్ (45) అనే వ్యక్తిని పెళ్లాడబోతోందని తెలిసి తట్టుకోలేకపోయాడు. దీంతో ఈశాన్య ఢిల్లీలోని ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. దీంతో జుబేర్, ఫైసల్ తల్లి షహీన్ నాజ్ (45) కూడా జోక్యం చేసుకున్నారు. గొడవ మరింత పెద్దది కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన జుబేర్.. నీరజ్ గుప్తాను పొడిచి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఓ సూట్కేసులో కుక్కి రైలెక్కి గుజరాత్లోని బరూచ్కు తీసుకెళ్లి పడేశాడు.
తొలుత గుప్తా తలపై ఇటుకతో కొట్టిన జుబేర్ ఆ తర్వాత పొట్టలో మూడుసార్లు కత్తితో పొడిచాడు. అనంతరం గొంతు కోశాడు. నీరజ్ గుప్తా హత్యకు ఫైసల్, ఆమె తల్లి కూడా సహకరించినట్టు పోలీసులు తెలిపారు. నిందితులు ముగ్గురినీ అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈశాన్య ఢిల్లీలోని ఆదర్శ్నగర్కు చెందిన నీరజ్ గుప్తా కనిపించడం లేదన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తన భర్త కనిపించకపోవడం వెనక ఫైసల్ హస్తం ఉండొచ్చని అనుమానించిన నీరజ్ గుప్తా భార్య, పోలీసులకు అదే విషయాన్ని చెప్పింది. అంతేకాదు, ఫైసల్కు, తన భర్తకు మధ్య చాలా కాలంగా సంబంధం ఉందని ఆమె పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా నీరజ్ హత్య విషయం వెలుగుచూసింది.