రెచ్చిపోయిన ఢిల్లీ అల్లర్ల నిందితుడు.... యువకునిపై దాడి!

ABN , First Publish Date - 2021-03-25T14:49:46+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని ఖజూరీ ఖాస్‌లో ఒక యువకునిపై దాడి చేసి...

రెచ్చిపోయిన ఢిల్లీ అల్లర్ల నిందితుడు.... యువకునిపై దాడి!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఖజూరీ ఖాస్‌లో ఒక యువకునిపై దాడి చేసి, అతని చేత బలవంతంగా హిందుస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్దాబాద్ అనే నినాదాలు చేయించిన ఘటన వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోతో పాటు ఒక మెసేజ్ కూడా వైరల్ అయ్యింది. దీని ఆధారంగా ఖజూరీ ఖాస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అజయ్ గోస్వామి(25) అనే నిందితుడిని అరెస్టు చేశారు.


కాగా ఈ వీడియోను చిత్రించిన మరో నిందితుడు దీపక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సంజయ్ కుమార్ సేన్ మాట్లాడుతూ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యిందని, దానిలో ఒక యువకుడు మరో యువకునిపై దాడి చేస్తున్న దృశ్యాలున్నాయన్నారు. ఈ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. ఈ ఘటన ఖజూరీ ఖాస్ ప్రాంతంలో జరిగిందని, పోలీసులు విచారణలో నిందితుడిని అజయ్ గోస్వామిగా గుర్తించి, అరెస్టు చేశామన్నారు. అజయ్ ఢిల్లీ అల్లర్ల నిందితుడని, ఇటీవలే అతను బెయిల్‌పై విడుదలయ్యాడని పేర్కొన్నారు. కాగా అజయ్ పోలీసులతో మాట్లాడుతూ ఆ యువకుడు చోరీ చేయాలనే నెపంతో తన డెయిరీలోకి చొరబడ్డాడని పేర్కొన్నారు. అందుకే అతనిని కొట్టానని తెలిపాడు. అతని స్నేహితుడు దీపక్ వీడియో తీసి, వైరల్ చేశాడని తెలిపాడు.

Updated Date - 2021-03-25T14:49:46+05:30 IST