ఎడ్లబండిపై ఢిల్లీ యాత్ర.. ఆగింది

ABN , First Publish Date - 2022-05-29T08:29:05+05:30 IST

ఎడ్లబండిపై ఢిల్లీ యాత్ర.. ఆగింది

ఎడ్లబండిపై ఢిల్లీ యాత్ర.. ఆగింది

దుర్గారావును కలిసిన గ్రామ పెద్దలు, పోలీసులు.. న్యాయం చేస్తామని హామీ.. తిరిగొచ్చిన దుర్గారావు

కేసును సుమోటోగా విచారణకు తీసుకున్న హెచ్‌ఆర్సీ 


కంచికచర్ల/చందర్లపాడు, కర్నూలు లీగల్‌, మే 28: తన చెల్లికి న్యాయం చేయాలంటూ ఎన్టీఆర్‌ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాల గ్రామానికి చెందిన నేలవెల్లి నాగదుర్గారావు న్యూఢిల్లీకి చేపట్టిన ఎడ్లబండి యాత్ర నిలిచిపోయింది. ఐదు రోజుల కిందట చేపట్టిన ఎడ్లబండి యాత్ర వరంగల్‌ సమీపంలోని డోర్నకల్‌కు చేరాక.. శుక్రవారం రాత్రి పోలీసులు అడ్డుకున్నారు. ‘న్యాయం చేస్తాం.. వెనక్కిరావాలని’ గ్రామ పెద్దలు, పోలీసులు కోరడంతో దుర్గారావు అంగీకరించారు. బాధితుల కథనం ప్రకారం.. ముప్పాల గ్రామానికి చెందిన నేలవెల్లి నాగదుర్గారావు చెల్లెలు నవ్యతకు 2018లో చందాపురానికి చెందిన కొంగర నరేంద్రనాథ్‌తో పెళ్లి జరిగింది. రూ.23లక్షల నగదు, 320 గ్రాముల బంగారం, మూడు ఎకరాల పొలం కట్నంగా ఇచ్చారు. పెళ్లి తర్వాత భర్త నరేంద్రనాధ్‌ తనతో సక్రమంగా ఉండటం లేదని భార్య నవ్యత తన  ఆడపడుచుకు తెలిపింది. ఈ విషయం బయటకు చెప్పొద్దని, పరువు పోతుందని ఆడపడుచు నచ్చచెప్పింది. ఆతర్వాత ఆడపడుచు జర్మనీ వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు నవ్యతను బెదిరించి తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని చెబుతున్నారు. ఈ సంఘటనలపై చందర్లపాడు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయ గా, కేసు నమోదు చేశారు. అయినా కేసులో పురోగతి లేకపోవడంతో తనకు న్యాయం చేయాలంటూ కొద్ది రోజుల కిందట నవ్యత కృష్ణా నదిలో ఇసుక తిన్నెలపై నిరసన దీక్ష చేసింది. అయినా పోలీసులు స్పందించలేదు. తమకు ఇక్కడ న్యాయం జరిగే పరిస్థితి లేనందున, సుప్రీంకోర్టు, హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేసేందుకు నవ్యత సోదరుడు దుర్గారావు తల్లి జ్యోతితో కలిసి ఎడ్లబండిపై ఈ నెల 23న న్యూఢిల్లీ యాత్ర చేపట్టారు. ఎడ్లబండి యా త్రపై మీడియాతో కథనాలు రావటంతోపాటు సోషల్‌ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్‌ అయింది. దీంతో గ్రామ పెద్దలు, పోలీసులు డోర్నకల్‌ సమీపంలో దుర్గారావును కలిశారు. న్యాయం జరిగేలా చూస్తామని నచ్చజెప్పి దుర్గారావును, ఆయన తల్లి జ్యోతిని గ్రామానికి తీసుకువచ్చారు. తన చెల్లికి న్యాయం చేయాలని, కట్నకానుకలు తిరిగివ్వాలని, తమపై వేసిన పరువు నష్టం కేసు, ఇతర కేసులు వెనక్కి తీసుకోవాలని దుర్గారావు డిమాండ్‌ చేశారు. తన చెల్లికి న్యాయం జరగని పక్షంలో తిరిగి యాత్ర చేస్తానని దుర్గారావు చెప్పారు.


కలెక్టర్‌, ఎస్పీలకు హెచ్చార్సీ నోటీసులు

దుర్గారావు ఎడ్లబండి యాత్రపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ స్పందించింది. ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని సుమోటోగా తీసుకుంది. దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నోటీసు అందిన 48 గంటల్లో తెలపాలంటూ కమిషన్‌ గౌరవ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం (జ్యుడిషియల్‌) జిల్లా కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించారు. కేసు విచారణను వచ్చే నెల 13కి వాయిదా వేశారు. 

Updated Date - 2022-05-29T08:29:05+05:30 IST